రామయ్య నడయాడిన నేల…

  • పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత
  • మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి
  • అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష
  • వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి వరదల వలన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నామని, అటువంటి భద్రాచలంను పరిశుభ్రముగా ఉంచవలసిన బాధ్యత మన పైన ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, ‌జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నాడు స్థానిక సబ్‌ ‌కలెక్టరు కార్యాలయంలోని సమావేశ మందిరములో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీతమ్మ నడయాడి రాముడు కొలువై ఉన్న దేవస్థానమును మరియు దేవస్థానం భూములను సర్వే చేసి ప్రతిపాదనలు పూర్తిచేసి పది కాలాలపాటు ఉపయోగపడేలా మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తయారు చేయాలని అన్నారు.

 

వొచ్చే భక్తులకు దుర్గంధం వెదజల్లకుండా దేవస్థానం పరిసరాలతో పాటు భద్రాచలం వీధులలో చెత్త ఎక్కడబడితే అక్కడ వేయకుండా గ్రామపంచాయతీ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు చెత్తను ఏరివేసి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా డంపింగ్‌ ‌యార్డ్ ‌లలో వేయాలని, డంపింగ్‌ ‌యార్డ్ ‌నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, శానిటేషన్‌ ‌పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామపంచాయతీ ఈవో కు సూచించారు. పునరావాస కేంద్రాల్లో కూడా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని అన్నారు. భద్రాచలానికి రాబోయే రోజులలో సర్వ సుందరంగా తీర్చిదిద్ది కీర్తి ప్రతిష్టలు వొచ్చేలా చూడాలని అన్నారు. గోదావరి వరదలు రాకముందే మే జూన్‌ ‌నెలలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ‌ద్వారా స్లూయిస్‌ ‌పాయింట్‌ ‌దగ్గర శాశ్వత నిర్మాణం చేపట్టి భద్రాచలం పట్టణంలో నీరు నిలువ లేకుండా నిలువరించాలని, భద్రాచలం పట్టణం నుండి మొదలుకుని గుండాల వాజేడు వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు సౌకర్యాలు కల్పించి ఎక్కడ వరదలవలన ఇబ్బందులు లేకుండా రోడ్డు మార్గము ఏర్పాటు చేయాలని గోదావరి కి వచ్చే భక్తులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్లీవ్స్ ‌పాయింట్‌ ‌నుంచి ఏర్పాటు చేసిన పైపులు కింది నుంచి వేసి శాశ్వతంగా అమర్చాలని అన్నారు.

వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనా వేయాలి
అకాల వర్షాల వలన నష్టం వాటిల్లిన పంటలకు ఇండ్లకు నష్ట పరిహారం అందించడానికి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన జిల్లా కలెక్టర్కు అందజేయాలని మంత్రి తుమ్మల అన్నారు. బుధవారం నాడు సబ్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయంలో వరదల వలన నష్టపోయిన వివిధ రకాల ప్రజల అంశాల గురించి శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాడైపోయిన భవనాలు ఏమైనా ఉంటే వెంటనే ఇంజనీర్ల చేత తనిఖీ చేయించి వాటిని కూలగొట్టాలని, అలాగే పంటలు మునిగితే సైంటిస్టుల చేత రైతులకు సలహాలు సూచనలు అందించి భూసార పరీక్షలు చేయించి అనుకూలమైన పంటలు వేసుకునేలా చూడాలని, పశువులు కోళ్లు మేకలు, గొర్రెలు నష్టం జరిగితే వెంటనే వివరాలు పంపిస్తే వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. భద్రాచలం డివిజన్లో రోడ్లు ఎక్కడైనా డ్యామేజ్‌ అయితే టెంపరరీగా రోడ్లు వేయాలని, మొన్నటి వరదలకు 14 గ్రామాలలో రోడ్లు డ్యామేజ్‌ అయినందున ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కు పంపించాలని, అన్ని మండలాల్లోని కల్వర్టులు బ్రిడ్జిలు ఫోటోగ్రఫీ చేయించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు.

 

ఇరిగేషన్‌ ‌శాఖ అధికారులు వరదలు రాకముందే ముందస్తు సమాచారము ఇంద్రావతి ప్రాణహిత పేరూరు ద్వారా రిపోర్టు తెలుసుకొని వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలని అన్నారు. కొత్తగా నిర్మించిన కరకట్ట పూర్తికాగానే పై భాగంలో గాని కింది భాగంలో గాని ఎక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టకూడదని అన్నారు. వరదల సమయంలో గుండాల మండలం నుండి వాజేడు భద్రాచలం వరకు ఎక్కడ మంచినీటి సమస్య రాకూడదని తప్పనిసరిగా మిషన్‌ ‌భగీరథ నీరు అందేలా చూడాలని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లోనే కాక అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని గర్భిణీ స్త్రీలను ముందుగానే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్సలు చేయించాలని, సరిపడా మందులు ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు సిద్ధంగా ఉండాలని అన్నారు. సివిల్‌ ‌సప్లై ద్వారా అన్ని మండలాలలో బఫర్‌ ‌స్టాకు సిద్ధంగా ఉంచాలని అందరికీ రేషన్‌ ‌సరఫరా కావాలని, డీలర్లు ఎవరైనా తప్పు చేస్తే వారిని తొలగించి మహిళా గ్రూపులకు ఆ బాధ్యత అప్పగించాలని అన్నారు.

 

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలీసు రెవెన్యూ ఐటీడీఏ మరియు ఇతర శాఖల అధికారులు దుమ్ముగూడెం చర్ల మండలాల్లోని 16 గ్రామాలకు వరద ముంపు అధికంగా ఉన్నందున పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని ముందుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. గిరిజన గ్రామాలలోని పాఠశాలల పట్ల ఐటీడీఏ పీవో ప్రత్యేక బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌, ఎస్పీ రోహిత్‌ ‌రాజ్‌, ఐటీడీఏ పీవో బి రాహుల్‌, ఆర్డిఓ దామోదర్‌ ‌రావు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, సెక్టరల్‌ అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page