- ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు..
- బడ్జెట్లో విద్య, వైద్యానికి అత్యధిక నిధులు
- నిరుద్యోగులు సమస్యలుంటే మంత్రులు, ఎంఎల్ఏలకు విన్నవించండి
- మీ రేవంతన్నగా పరిష్కరించి అండగా ఉంటా
- ఫైర్మెన్ పాసింగ్ ఔట్ పరేడ్లో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో 90 రోజుల్లో మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని, ముఖ్యయంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతామని, అధికారంలోకి వొచ్చి ఏడాది తిరగకముందే 60వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతుందని, అందులో భాగంగానే బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించామని, ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ప్రాధాన్యతనిచ్చామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతం అందించి వారికి ప్రభుత్వంపై విశ్వాసం కల్పించామన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్కు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ…ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని చూసి తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారన్నారు. ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో..ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసామన్నారు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వొచ్చిన ఫైర్మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని అభినందించారు. కాగా నిరుద్యోగులకు, విద్యార్థులకు తన సూచన ఒక్కటేనని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని, పరిష్కరించేందుకు రేవంతన్నగా వారికి ఎప్పుడూ అండగా ఉంటానని సొఎం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇంకా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.