- రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం..
- సర్కారుకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు తెలియదు..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు
ఖమ్మం, ప్రజాతంత్ర : ఖమ్మం జిల్లాలో పంటలన్నీ ఎండిపోతున్నాయని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉంది, సాగర్ లో నీరున్న పంటలన్నీ ఎండిపోతున్నాయి. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారు. పార్టీలకతీతంగా అందరూ ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో హరీష్రావు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.
గతేడాది నీరు లేక పొలాలు ఎండిపోయాయి. కానీ ఈసారి పుష్కలంగా వర్షాలు పడినా కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి కూడా గండిపడిన కాల్వ పక్క నుంచే వెళ్తున్నారు. 22 రోజులైనా గండి పూడ్చాలని సోయిలేదని ధ్వజమెత్తారు .ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి.. జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చడం చాతకాదా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా కాంగ్రెస్ సర్కార్కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రాదా? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రాదా? అని హరీష్ రావు నిలదీశారు. ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నష్టం పరిహారం చెల్లించడంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కన్నీళ్లు పెట్టిస్తుందని, ఎకరాకు 25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.వరద నష్టం వల్ల సాగర్ పరీవాహక ప్రాంతాల్లో 60వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాలు పోయినట్లు ప్రాథమిక అంచనా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవు. ఆగస్టు 15న సీఎం రేవంత్ ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు ప్రారంభించి 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు. సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు. పనులు పూర్తికాకుండా సీఎం రేవంత్ రెడ్డి సీతారామస్వామి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం
బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతాం. ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారు. దాడులకు ఏనాడు భయపడం.. వరద బాధితులను పరామర్శించేందుకు మాపై దాడులు చేశారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. పోలీసులు అతి ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూశాం.. పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి. ప్రభుత్వాలకు లోబడి కాదు. ప్రభుత్వ వైఫల్వాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తుండ్రు. లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతుంటే, లక్షల మంది డెంగ్యూ చికెన్ గున్యా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో గుండాయిజం, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 2 వేల రేప్కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై ఇండిమీదికి ఇటీవల కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఈ దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాత్రిపూట ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేసిండ్రు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు.. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.