హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు..
చెరువులను ఎవరు ఆక్రమించినా.. చర్యలు తప్పవు
రైతు భరోసా, రుణమాఫీ కన్నా రైతులకిచ్చే బోనస్తో ఎక్కువ లబ్ధి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
దిల్లీ, డిసెంబర్ 12 : మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు మల్లు భట్టి విక్రమార్క గురువారం దిల్లీలో అల్పాహారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దిల్లీలో ఈరోజు రాహుల్ గాంధీని కలవలేదని అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన పట్ల 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వందశాతం మంది ప్రభుత్వ పాలన పట్ల సంతోషంగా ఉంటారనుకోవడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని చెప్పారు. హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదని స్పష్టం చేశారు. ఎవరు చెరువులను ఆక్రమించినా.. వారిపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టబోతున్నామని తెలిపారు. రైతు భరోసాను సంక్రాంతి నుంచి అమలుచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించామని అన్నారు.
రైతులకు ఇచ్చే బోనస్లో రైతు భరోసా, రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుందని మల్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ తల్లి గతంలో అధికారికంగా లేదని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ మార్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు 11 నెలల్లో రూ.64 వేల కోట్ల అసలు వడ్డీ కట్టామని తెలిపారు. రాష్టం ఏర్పడే నాటికి ఏడాదికి రూ.6400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏడాదికే రూ.64 వేల కోట్లు కట్టాల్సి వొచ్చిందనిమల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని, అందుకే ప్రచారంలో వెనుకబడ్డమన్నారు. పదేళ్ల తర్వాత హాస్టళ్లకు ఇచ్చే డైట్ చార్జీలు పెంచామని తెలిపారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలన తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.