కొత్త సంప్ర‌దాయానికి స‌ర్కారు నాంది

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు అవ‌గాహ‌న సద‌స్సులు మంచి ప‌రిణామం
త్వరలోనే స‌భ్యుల‌కు క్రీడ‌లు, స్టడీ టూర్స్ నిర్వ‌హిస్తాం..
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది ప‌లికింద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.  గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా ఎమ్మెల్యేలకు – ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ విధి విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం శుభపరిణామమని తెలిపారు.   శాసనసభ కార్య విధానం కార్యక్రమ నిర్వాహణ నియమావళిపై తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్‌, శాసనసభ సభ్యులకు జూబ్లీహిల్స్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేచర్ మినిస్టర్ డి శ్రీధర్ బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది ప‌లికింద‌ని అన్నారు.

గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా ఎమ్మెల్యేలకు – ఎమ్మెల్సీలకు లేజిస్లేచర్ విధివిధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించున్నామ‌ని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను భవిష్యత్ లో కొన‌సాగించాల‌ని సూచించారు. ప్రభుత్వం సహకారం అందిస్తే త్వరలోనే అసెంబ్లీ, శాసన మండలి అన్ని కమిటీలను పూర్తి చేస్తామ‌న్నారు. త్వరలోనే స్టడీ టూర్ లను కూడా ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు.  స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారికంగా శాసన పరిషత్‌, శాసనసభ సభ్యులకు ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేశామ‌ని, శాసన వ్యవహారాలు తెలుసుకోవాలనే ఆసక్తితో సభ్యులంద‌రూ  హాజరుకావ‌డం సంతోషక‌ర‌మ‌ని అన్నారు.

ఈ రెండు రోజుల ఓరియెంటేషన్ ప్రోగ్రాం ద్వారా శాసన పరిషత్తు, శాసనసభలలో హక్కులు, బాధ్యతలు తెలుసుకున్నార‌ని,   మనం ఎంత థియరీ నేర్చుకున్నా దానిని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి విలువ, నిజమైన గుర్తింపు వొస్తుంద‌ని తెలిపారు. స‌భ్యులు తెలుసుకున్న విషయాలను వొచ్చే సమావేశాలలో అమలు చేయడం ద్వారా  మీకే  గౌరవం పెరుగుతుంద‌ని తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డి,  లేజిస్లేచర్ మధ్య స‌మన్వ‌యం చేసి ఈ సదస్సును విజయవంతం చేసిన లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు తరచుగా నిర్వహిస్తామ‌ని, శాసన సభ్యులకు క్రీడలు నిర్వహించడం, స్టడీ టూర్లకు పంపండం వంటి కార్యక్రమాలు జరుపుతామ‌న్నారు. ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్, లేజిస్లేచర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  శాసనమండలి సభ్యులు 17 మంది, శాసనసభ సభ్యులు 61 మంది ఈ అవగాహన సదస్సుకు హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page