- ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు
- బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గురువారం యాదగిరిగుట్ట దేవాలయాన్ని దర్శించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేయయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించాలని, తెలంగాణ ప్రజలపై దయ ఉంచాలని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటామమని హరీష్ రావు తెలిపారు.హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని, సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం యాదాద్రి దేవాలయాన్ని దర్శించుకుని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేయబోతున్నామన్నారు.
ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించాలని, తెలంగాణ ప్రజలపై దయ ఉంచాలని యాదగిరి నరసింహా స్వామిని వేడుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చేసిన పాపం ప్రజలకు శాపం తగలకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థిస్తామన్నారు. రూ. 49 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని, డిసెంబర్లో చెప్పారని, కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో రూ.40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారని, క్యాబినెట్లో నిర్ణయించిన 31వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారని, దాన్ని మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 26 వేల కోట్లకు కుదించారని, ఆగస్టు15 నాడు రూ.17 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందని చెప్పారని విమర్శించారు.
రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదంటున్నారని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రకటించారని, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని అంటున్నారని, ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని, కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు గురువారం ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటానని హరీష్ రావు తెలిపారు. రైతలందరి తరుపునా ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుదామని ఆయన పిలుపునిచ్చారు.