– స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా
– వీబీజీ పథకంపై సుప్రీం కోర్టుకు
– టిమ్స్ లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు
– మూసీ ఫేజ్-1 అబివృద్ధి కోసం రూ.7,345 కోట్లు మంజూరు
– మంత్రిమండలి నిర్ణయాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులతోపాటు రాష్ట్రంలోని లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. వీబీజీ రామ్జీ పథకంపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గ సమావేశం భావించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కూలీలకు ఉపాధి భద్రత కల్పించాలన్న లక్ష్యంతో 2006లో యూపీఏ ప్రభుత్వ హయాంలో తెచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకంపై గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సమావేశం సుదీర్ఘంగా చర్చించినట్టు వారు తెలిపారు. నిరుపేదల హక్కులను హరించే విధంగా ఉన్న వీబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా యధాతథంగా అమలు చేస్తోందన్నారు. గత్యంతరం లేని, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగొద్దని ఆ పథకాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని భావించినట్టు చెప్పారు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. సనత్నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్తోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిమాయకానికి 6,278 పోస్టులు మంజూరు చేసింది. ఈ హాస్పిటల్స్ను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎలఓసీలు జారీ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-1లో గాంధీ సరోవర్ వరకు 21 కి.మీ మేరకు పూర్తి చేయడానికి మంత్రిమండలి పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఫేజ్-1 ప్రాజెక్టు అబివృద్ధి కోసం రూ.7,345 కోట్లు మంజూరు చేస్తూ కేబినెûట్ ఆమోదం తెలిపినట్టు మంత్రులు పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





