- క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలి
- రేవంత్ మొదటి అపాయింట్మెంట్ వికలాంగురాలికే ఇచ్చారు..అంగవైకల్యం ఉన్న జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్
- సీఎంఓలో పనిచేసి అవగాహనలేక మాట్లాడటం బాధాకారం..సీఎం స్పందించకపోతే ట్యాంక్ బండ్ పై నిరసన దీక్ష
- సివిల్స్ పరీక్షల కోచ్ బాలలత మల్లవరపు డిమాండ్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : దివ్యాంగులపై ఎక్స్ వేదికగా ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని సామాజిక వేత్త, మెంటర్, సివిల్స్ పరీక్షల కోచ్ బాలలత మల్లవరపు డిమాండ్ చేశారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మిత సభర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా స్మిత సభర్వాల్ మాట్లాడుతుందన్నారు.
అసలు ఫీల్డ్ లో పరిగెత్తుతూ స్మిత సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందన్నారు. వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత సభర్వాల్ మాటలు మరింత కుంగదీసాయని అన్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మొదటి అపాయింట్ మెంట్ వికలాంగురాలికి ఇచ్చారని గుర్తు చేశారు. స్మిత తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతుందా? ప్రభుత్వం తరపున మాట్లాడుతుందా అనేది తెల్చాలన్నారు.
కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మిత సభర్వాల్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. అంగవైకల్యం ఉన్న జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ ఘనత సాధించారన్నారు. ఎప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తానని, తనకన్నా ఎక్కువ మార్కులు సాధించమని స్మిత సభర్వాల్ కు సవాల్ విసిరారు. స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారన్నారు.
కెసిఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంఓలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారం అన్నారు. అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నవారు ఉన్నారన్నారు. 24 గంటల్లో స్మిత సభర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మంగళవారంలోగా ప్రభుత్వం ఈ అంశంపై రియాక్ట్ అవ్వకపోతే ట్యాంక్ బండ్ పై నిరసన దీక్ష చేపడుతాం అన్నారు.