- రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని మలుపు
- తిరిగి సొంతగూటికి గద్వాల ఎంఎల్ఏ
- అదే బాటలో భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావ్…?
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సహజంగానే విపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి ఇప్పటి వరకూ అలాగే జరిగింది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ ఖాలీ అవుతుందంటూ ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. అవును.. బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు మళ్లీ సొంతగూటి వైపు చూస్తున్నారని వార్తలు వినవొస్తున్నాయి. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. కాంగ్రెస్ వొద్దు బీఆర్ఎస్లోనే ఉంటానంటూ రిటర్న్ అయ్యారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. ఇప్పుడు మనసు మార్చుకుని సొంత పార్టీలోకి వొచ్చేశారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఆయన..తాను మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అయితే, కృష్ణమోహన్ ఘర్వాపసీతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలగా.. బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పార్టీని వీడి వెళ్లిన మిగతా ఎమ్మెల్యేలను సైతం తిరిగి రిప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇటీవల కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తెల్లం వెంకట్రావ్ కలిశారు. అనంతరం కేటీఆర్తో భేటీ అయ్యారు. ఇవాళో రేపో ఆయన కూడా బీఆర్ఎస్లోకి పునరాగమనం చేస్తారని గట్టి ప్రచారమే నడుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో మాత్రమే గెలుపొంది..రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు వరుసగా బీఆర్ఎస్ను వీడటం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరే కాదు..ఇంకో పది మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని, బీఆర్ఎస్కు విపక్ష హోదా ఉండని కాంగ్రెస్ నేతలు గట్టి ప్రకటనలే చేశారు. ఆషాఢమాం అయిపోయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని హస్తం పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. ప్రకటనల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓవైపు చేరికలుంటాయని భావించిన కాంగ్రెస్కు..ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రూపంలో రివర్స్ షాక్ తగిలింది.
కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ కావాలి అంటూ రిటర్న్ అయ్యారు. ఈయనొక్కరే కాదు.. ఇటీవల కాంగ్రెస్లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు సైతం తిరిగి సొంత గూటికి చేరుతారని ప్రచారం జరుగుంఱంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ పునరాగమనం దాదాపు ఫిక్స్ అవగా.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా తిరిగి బీఆర్ఎస్లో చేరుతారని గులాబీ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేల ఫార్వర్డ్, రివర్స్ జంపింగ్ గేమ్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ నేతలైతే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టింది. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్లు తిరిగి వొస్తారని, వారితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమ పార్టీలోకి వొస్తారని గులాబీ పార్టీ పెద్దలు ప్రకటిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఘర్ వాపసీ ఊపందుకుంటుందా? లేక కాంగ్రెస్ చెప్పినట్లు ఉన్నోళ్లను సైతం లాగేసుకుంటుందా..అనేది చూడాలి.