నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు నీరు అందిస్తామని నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శించారు. మొదట వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో శంకరసముద్రం రిజర్వాయర్ ను పరిశీలించారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర ఎమ్మెల్యే జి . మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కొత్తకోట హెలిప్యాడ్ వద్ద మంత్రులకు స్వాగతం పలికారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రిజర్వాయర్ గురించి వివరిస్తూ శంకర సముద్రం రిజర్వాయర్ ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని, కానీ చిన్న చిన్న సమస్యల వల్ల పూర్తి స్థాయిలో సాగు నీరు అందించలేక పోతున్నామని ఉత్తమ్ కుమార్ దృష్టికి తెచ్చారు. ఇంటెక్ వెల్ లో బండను తొలగించి వెడల్పు చేస్తే ఎక్కువ నీటిని లిఫ్ట్ చేయవచ్చని తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ శంకర సముద్రం రిజర్వాయర్ లో కానాయపల్లి పునరావాస కేంద్రం సమస్య పరిష్కరించాలని కోరారు.
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పునరావాస కేంద్రానికి రూ.75 కోట్ల నిధులు అవసరమని, ఆనకట్టకు మరో రూ.10 కోట్లు కేటాయిస్తే శంకర సముద్రం రిజర్వాయర్ పనులు పూర్తి చేయవచ్చని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ భీమా సాగునీ టి ఎత్తిపోతల పథకంలోని శంకర సముద్రం పునరావాస సమస్యలను పరిష్కరిస్తామనీ తెలిపారు. పూర్తి నివేదికలను వారం రోజుల్లో ఇవ్వాల్సిందిగా జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి ని ఆదేశించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్ సి (జనరల్) అనిల్ కుమార్, ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ కేశవ్ రావు, మధుసూదన్ రెడ్డి, డీఈ ఎల్ల స్వామి, ఏఈ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.