దేశానికి రోడ్మ్యాప్ కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ
ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సిఎం రేవంత్ భేటీ
కేబినేట్పై చర్చించలేదని వెల్లడి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్ మ్యాప్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు గంటసేపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రధానంగా చర్చకు వొచ్చినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. కులగణన ద్వారా ప్రజాసంక్షేమానికి బాటలు వేస్తున్నామని అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ఒక రోల్ మోడల్. రాహుల్ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా చేస్తా.
రాష్ట్రంలో కులగణన సమగ్రంగా నిర్వహించాం. ఇందులో వెల్లడైన వివరాల ఆధారంగా భవిష్యత్లో కమిషన్ గానీ, కమిటీ గానీ వేసి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ ఫలాలు చేరువ చేయాలనే దానిపై కసరత్తు చేస్తామని వివరించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామన్నారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా తాను తిట్టలేదని, మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని అన్నాను. నా వ్యాఖ్యలను కిషన్రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రివర్గ విస్తరణ చర్చకు రాలేదు..
కాగా రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ చర్చకు రాలేదని రేవంత్రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామని అన్నారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడంతో కేబినెట్ విస్తరణ కోసమేనని ఊహాగానాలు వినిపించాయి. మంత్రి పదవులు ఆశిస్తోన్న ఆశావహులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో చేసిన కుల గణన గురించి రాహుల్ గాంధీకి వివరించానని మాత్రమే తెలిపారు. కేవలం కుల గణన, ఎస్సీ వర్గీకరణపై మాత్రమే రాహుల్ గాంధీతో చర్చించానని.. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యకర్గ కూర్పుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టత ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ క్యార్గవర్గంపై చర్చించేందుకే ఈ భేటీ అన్న ఊహాగానాలు రేవంత్ రెడ్డి కొట్టి పారేశారు. కేబినెట్ విస్తరణ అంశం హై కమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. కోర్టులు చేసే పనిని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని.. ఉప ఎన్నికలు వొస్తాయో రావో కేటీఆరే చెప్పేస్తున్నారని మండిపడ్డారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి ఏ బీ ఫామ్ మీద గెలిచారు..? ఎవరి మంత్రి వర్గంలో పనిచేశారు..? తలసాని శ్రీనివాస్ 2014లో గెలిచింది ఏ బీ ఫామ్ మీద, మంత్రిగా పనిచేసింది ఎవరి ప్రభుత్వంలో..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో కమిషన్లు ఇచ్చే నివేదికలు చట్టబద్ధం చేస్తామని చెప్పారు. వీటిలో ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదన్నారు. రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతోనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కు పంపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.