ప్రాజెక్ట్ ల పురోగతి పై పర్యవేక్షణ పెంచాలి
రాజస్థాన్లో జరిగే నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి సమగ్ర నివేదిక రూపొందించాలి
ప్రాజెక్ట్ ల పూడికతీతపై ఇతర రాష్ట్రాలకు దిశానిర్దేశం
ఎస్ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ల పురోగతిపై సమీక్ష
పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : నీటిపారుదల శాఖ పారదర్శకంగా పనిచేయాలని, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిర్దేశించిన పనుల్లో ఆలసత్వం చూపిస్తే సహించేది లేదని మంత్రి అధికారులను సున్నితంగా విమర్శించారు. ఈనెల 18,19వ తేదీలలో రాజస్థాన్ లో జరగనున్న అఖిల భారత నీటిపారుదల మంత్రుల సదస్సుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్.ఎల్.బి.సి, డిండితో పాటు వివిధ ఎత్తిపోతల పథకాల పురోగతి తో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై శనివారం జలసౌధలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఆడిత్యా దాస్ నాథ్, ఇఎన్సి అనిల్ కుమార్ సిఇలు కె.శ్రీనివాస్, అజయ్ కుమార్, రమేష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాజస్థాన్ లో జరగనున్న జాతీయ స్థాయి నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో రాష్ట్రం నీటిపారుదల రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, డిజిటల్ మానిటరింగ్ తో పాటు ఆధునిక నీటి నిర్వహణపై అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు.
అంతే కాకుంటా మైక్రో ఇరిగేషన్ అమలు తీరుపై జాతీయ స్థాయిలో గణాంకాలతో ప్రదర్శించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించలన్నారు. ప్రాజెక్టులలోపూడికతీత ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనమయ్యేలా దిశానిర్దేశం చేసునున్నట్లు ఆయన వెల్లడించారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నీటి పాలన విధానాలు, తక్కువ వ్యయంతో అధిక ఆయకట్టు విస్తరణ, ఇంకా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వంటి అంశాలపై ప్రధానంగా ఈ సమీక్షలో ప్రస్తావనకు వొచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో గరిష్ట ఆయకట్టును విస్తరించడంపై కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడితో అధిక నీటి పారుదల ప్రయోజనాలను అందించగల ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా అదనంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని మంత్రి వివరించారు. ఎస్ఎల్బిసి (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ), దిండీ, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, ఇంకా పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కఠినమైన గడువులు విధించాలన్నారు. అదే విధంగా, నీటి పారుదల పనుల పర్యవేక్షణను మెరుగుపరిచి, పారదర్శకత, సమర్థత పెంచాలన్నారు.
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ లో నిర్వహించనున్న జాతీయ సదస్సు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులను, కేంద్ర ప్రభుత్వ విధానకర్తలను, నీటి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురానుందన్నారు ఈ సదస్సులో నీటి పాలనను బలోపేతం చేయడం, నీటి నిల్వలను మెరుగుపరచడం, నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచడం వంటి ముఖ్య అంశాలపై చర్చలు జరగనున్నాయన్నారు. సమావేశంలో తెలంగాణలో నీటి నిల్వలను పెంచడం గురించి ప్రత్యేక చర్చ జరిగింది. ఆనకట్టల సమర్థవంతమైన నిర్వహణ, నదుల అనుసంధానం, భూగర్భజల భద్రత విధానాలు భవిష్యత్తులో నీటి భద్రతను పెంచడంలో కీలకమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రధాన ఆనకట్టల వినియోగంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ తీరును వివరించే సమాచారాన్ని కూడా అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నీటి వినియోగ సామర్థ్యం గురించి మంత్రి ప్రత్యేకంగా చర్చించారు.
రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు మైక్రో-ఇరిగేషన్ (డ్రిప్ %•% స్ప్రింక్లర్) విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సదస్సు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను మంత్రి జారీ చేశారు. తెలంగాణ ప్రదర్శనను గణాంకాలతో, దృశ్య రూపాలతో, విజయవంతమైన కేస్ స్టడీలతో పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర సహాయం, నిధుల పెంపుదలకు, రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులకు మరింత సహకారం పొందేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుందని ఆయన చెప్పారు తెలంగాణ ప్రభుత్వం తక్కువ వ్యయంతో గరిష్ట సాగునీటిని అందించడంపై దృష్టి సారిస్తూ, సమర్థవంతమైన నీటి వనరుల నిర్వహణకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ జాతీయ సదస్సులో తెలంగాణ నీటి పారుదల వ్యూహాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు గొప్ప వేదిక కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.