కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈమేరకు టీజీఎస్ ఆర్టీసీ తాజాగా 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ లతో కలిసి రవాణా, బిసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులను మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని, జేబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందని,హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024
హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్సులనే తీసుకొస్తామని తెలిపారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీ ని మెరుగుపరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి 3,200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారని తెలిపారు. ఆర్టీసీ బస్సులకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని, ఆర్టీసీ – ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ లో ఉద్యోగులు, కార్మికులకు పిఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.