ట్రిపుల్ఆర్ బాధితుల‌ త‌ర‌పున ఉద్యమిస్తాం..

  • రైతుల‌కు ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకోవాలి..
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు

ట్రిపుల్ బాధితులకు న్యాయం జ‌రిగేలా వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తామ‌ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు భ‌రోసా ఇచ్చారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్‌ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని మంత్రికి వివరించారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు బాధితులకు ధైర్యం చెప్పారు.

బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. ఈసంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్‌ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను డిమాండ్ చేశారు. భువనగిరి ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యమ‌ని అన్నారు.

ట్రిపుల్ ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలో మీటర్లను పరిగణలోకి తీసుకొని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్య నుంచి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నదని, బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నారు. చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184 కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారు. దీనికి నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారు. దక్షిణ భాగాన ఆర్ఆర్ఆర్‌ కోసం ఎలాగైతే 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఉత్తర బాగానే ఉన్న చౌటుప్పల్ వైపు 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

ఎంపీగా ఉన్నపుడు కోమటి రెడ్డి బాధితులతో కలిసి ఆర్ ఆర్ ఆర్‌ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం దుర్మార్గం అని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీ అమలు చేయాల‌ని లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బాధితులు, రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ప్రచార సభల్లో మీరు ఇచ్చిన హామీలను మరోసారి మీకు గుర్తు చేస్తున్నా. ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని బాధితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదేశించాలని కోరుతున్నాం. ప్రియాంక గాంధీ మీరైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదా కాంగ్రెస్ నైజమే ఇంత అని మాట తప్పుతారా? అని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page