బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

  • ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర
  • మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా?
  • మాజీ మంత్రి కేటీఆర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి, వోట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్‌ ‌కింద అమ్మేస్తారా అంటూ నిలదీశారు. సీసీఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? వారి ఆర్థనాదాలు వినిపించడం లేదా మండిపడ్డారు. ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్‌లైన్‌లో టెండర్లు పిలవడం, సీసీఐ సంస్థ గొంతు కోయడమేనన్నారు.

నిర్మాణ రంగంలో సిమెంటుకున్న డిమాండ్‌ ‌దృష్ట్యా సీసీఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని బీఆర్‌ఎస్‌ ‌పదుల సార్లు కేంద్రమంత్రులకు మొరపెట్టుకున్నా కనికరించకపోవడం ఆదిలాబాద్‌కు వెన్నుపోటు పొడవడమేనని చెప్పారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్‌ ‌షిప్‌, 48 ‌మిలియన్‌ ‌లైమ్‌ ‌స్టోన్‌ ‌నిల్వలతో సకల వనరులున్న సంస్థను అంగడి సరుకుగా మార్చేసిన కేంద్రానికి ఉద్యోగులు, కార్మికుల గోస తగలక మానదన్నారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తాం.. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రోత్సాహం అందించి వాటిని ఆదుకోవాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ ‌సంస్థలకు అండగా నిలుస్తున్నది. అస్మదీయులకు ప్రభుత్వ సంస్థలను కట్టబెడుతూ ఉద్యోగులను రోడ్డుపాలు చేస్తున్నది. కార్పొరేట్‌కు అప్పగించే పనుల్లో భాగంగా ఆదిలాబాద్‌ ‌సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా(సీసీఐ)ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మూతబడిన సీసీఐ యంత్ర సామగ్రిని స్క్రాప్‌ ‌కింద వేలం వేయడానికి టెండర్లను ఆహ్వానించింది.

దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సిమెంటుకు డిమాండ్‌ ‌భారీగా ఉంది. ఆదిలాబాద్‌ ‌సిమెంటు పరిశ్రమను ప్రారంభించడానికి అన్ని వనరులు ఉన్నాయి. సీసీఐని ప్రారంభిస్తే 2,500 మందికి ప్రత్యక్షంగా, మరో 2,500 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సీసీఐని ప్రారంభించాలని గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. పరిశ్రమ పునఃప్రారంభానికి రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌, ‌మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు ఇతర బీఆర్‌ఎస్‌ ‌నేతలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ ‌పాండేలను కలిసి అనేకసార్లు వినతిపత్రాలు అందజేశారు. కానీ, మోదీ సర్కారు స్పందించలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా వేలాది మంది ఉపాధిని పట్టించుకోకుండా, స్థానికుల మనోభావాలను లెక్కచేయకుండా పరిశ్రమను కేంద్రం ప్రభుత్వం విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. కేంద్రంలోని మోదీ సర్కారు ఈ పరిశ్రమను అమ్మేందుకు మూడేండ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. మొదటిసారి స్క్రాప్‌ ఈ-‌వేలంలో భాగంగా 2022 మే 5న ఆన్‌లైన్‌లో బిడ్లను ఆహ్వానించింది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పట్లో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. మరోసారి ఈ టెండర్లను కేంద్రం పిలిచింది. ఈ నెల 7 నుంచి టెండర్లను ఆన్‌లైన్‌లో దాఖలు చేసుకోవచ్చని సూచించింది. మూతబడిన ఆదిలాబాద్‌ ‌సిమెంటు పరిశ్రమలో 71 పరికరాలకు సంబంధించి వేలం ప్రారంభ ధర రూ.43.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలియజేశారు. దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page