కెటిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం
రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం
అందరూ శాంతియుతంగా పాల్గొనాలని వినతి
బిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ…హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు. బిఆర్ఎస్ పని అయిపోయిందని సొంత పార్టీ నేత అరెకపూడి గాంధీ అంటున్నారని చెప్పారు. ప్రాంతీయతను రాజకీయంగా వాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ, కౌశిక్రెడ్డి ఇద్దరూ చేసింది తప్పేనన్నారు. భౌతిక దాడులు మంచివి కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తుందన్నారు. శాంతి భద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని, పార్టీ ఫిరాయింపులను తాము ఎక్కడా ప్రోత్సహించలేదన్నారు. బిఆర్ఎస్ గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను చేర్చుకుందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బిఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా..అంటూ పొన్నం ప్రశ్నించారు.
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తుందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని •ంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సోషల్ వి•డియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయాలని సూచించారు. 17న జరిగే నిమజ్జన వేడుకలు రాజకీయాలకతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే ఉన్నత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారని, జంటనగరాల్లో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు.
నిమజ్జనంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే పోలీస్, రెవెన్యూ శాఖలకు సత్వరమే తెలియజేయాలని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలన్నారు. 16న నిర్వహించే మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లిం మతపెద్దలు 17న జరుపుకునేలా అంగీకరించారని మంత్రి పొన్నం పేర్కొన్నారు. నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని, ఇప్పటికే జిల్లాస్థాయిలో అధికారులతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ఈ వేడుకల్లో మొత్తం 25 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు.