తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం
జర్నలిస్టులను కూడా వదలడం లేదు
డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన కెటిఆర్ బృందం
రుణమాఫీ చారాణ వంతు కూడా కాలేదని విమర్శ
ముందు కాంగ్రెస్ పెద్దల ఇళ్లు కూల్చాలి..తరువాతే సామాన్యుల జోలికి వెళ్లాలన్న కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : తమ సహనాన్ని పరీక్షిస్తే..చర్యకు ప్రతిచర్య తప్పదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేదన్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా.. అంటూ కెటిఆర్ ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేటీఆర్తో పాటు పలువురు బిఆక్ఎస్ నాయకులు డీజీపీని కలిసి ఫర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం తిరుమలగిరిలో బిఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వొచ్చిందని డీజీపీకి చెప్పారు. అనంతరం కెటిఆర్ వి•డియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలు చారాణా మందం రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు.
అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలని, భవిష్యత్లో చర్యకు ప్రతిచర్య ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. ఇక సిఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్కు దమ్ముంటే.. చలో దిల్లీ కాదు.. చలో ప్లలె చేపట్టాలని సవాల్ విసిరారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా…అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో.. ఏకంగా 20 సార్లు దిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా..రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా..అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అన్నీ గాలి మాటలు చెప్పారని, గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారని, వారి యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి..అంటూ కేటీఆర్ విమర్శించారు. అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు..రుణమాఫీ పూర్తి చేసెదెవరు..అంటూ కెటిఆర్ ప్రశ్నించారు.
అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప..అన్నం పెట్టే రైతుల తిప్పలు గురించి ఆలోచించే తీరిక లేదా..అంటూ ప్రశ్నించారు. రైతులకేమో మాయమాటలు.. దిల్లీ పెద్దలకు మాత్రం మూటలా..అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. 20 సార్లు చేపట్టిన దిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది.. గుండుసున్నా అని, ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది.. దిల్లీలో కాదని, తెలంగాణ గల్లీల్లో అని కెటిఆర్ అన్నారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి..అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యమని కేటీఆర్ హెచ్చరించారు. కెటిఆర్ వెంట ఎమ్మెల్యేలు జగదీవ్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే తుంగతుర్తి రైతులపై, సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడులపై కూడా డీజీపీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కూడా డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. బాధిత జర్నలిస్టులు శుక్రవారం డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు.
ముందు కాంగ్రెస్ పెద్దల ఇళ్లు కూల్చాలి..తరువాతే సామాన్యుల జోలికి వెళ్లాలన్న కెటిఆర్
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా ఉన్న భవనాలన్నీ కూల్చాల్సిందేనని, అయితే ముందుగా నేతల భవనాలను కూల్చిన తర్వాత సామాన్యులవి కూల్చాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు, పోలీసు నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర డీజీపీని కేటీఆర్ కలిసి ఫిర్యాదు చేసిన సందర్భంగా వి•డియాతో మాట్లాడుతూ…తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలోని లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని ఓ వి•డియా ప్రతినిధి కేటీఆర్ను ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా బదులిచ్చారు. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయని, ఆయన అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా శాటిలైట్ ఇమేజేస్ ఉన్నాయని, అవి చూసుకుని రంగనాథ్ మాట్లాడుకోమనండని అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్లో ఉన్న నిర్మాణాలను మొదట కూల్చడం ప్రారంభించాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయాలని కేటీఆర్ సూచించారు.