నన్నయ నుండి నేటి వరకు వచ్చిన సాహిత్యంలో ఏదో ఒక రూపంలో సామాజిక అంశాల ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలంలో రాజనిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని కవులు కొనసాగించినా సంఘ స్పర్శను వీడలేదనడానికి ఉదాహరణలు కోకొల్ల లుగా ఉన్నాయి. కవి, రచయిత, సంఘ జీవిగా ఉండడమే ఇందుకు ప్రధానమైన కారణం. సామాజిక విషయాలు, విలువలను తమ రచనలలో ప్రాచీన కవులు ఏదో ఒక రూపంలో వెల్లడించి తమ సామాజిక స్పృహను ప్రకటించారు. రాజ భక్తి, దైవానురక్తి, మతానుకూలత, నీతి, శృంగారం, ఆహార విహారాదులు, వేషభూషణలు, ఆహార్యం, నమ్మకాలు వంటి అంశాలలో ప్రాచీన సాహిత్యంలో ఆలోచనాత్మకమైన సామాజిక సందర్భా లను ప్రాచీనకవులు అత్యద్భు తంగా వెల్లడించారు. 19వ శతాబ్దం చివరలో ప్రారంభమై 20వ శతాబ్దంలో వికసించి విస్తరించిన ఆధునిక సాహిత్యం సమాజంలో ముఖ్యమైన అంతర్భాగమై సమస్యల పరిష్కార మార్గంగా, చైతన్యం నింపే శక్తిగా మారి లుప్తమైన మానవ విలువలను సరిదిద్దేందుకు ఎంతగానో తోడ్పడింది. ఈ క్రమంలోనే సాహి త్యంలో కనిపించే సువిశాల సమాజాన్ని దృశ్యమానంగా ఆవిష్కరిస్తూ ఆచార్య ఎన్ ఈశ్వర్ రెడ్డి వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలతో సాహిత్యంలో సమాజం అనే విమర్శనాత్మక వ్యాససంపుటి వెలువడింది.
తొలి వ్యాసం ఆలూరి బైరాగి కవిత్వం – అస్తిత్వ వేదనలో ప్రపంచ మానవ పోకడను తెగేసి చెప్పిన కవిగా బైరాగి విశిష్ట దృష్టికోణాన్ని వివరించారు. మనిషిని ఈర్ష్యా ద్వేష మోహపోహ వాంఛా కాంక్షల కీలలు దహిస్తుంటే చూస్తూ కూర్చోలేకపోయిన తాత్వికుడు అని బైరాగిని అభివర్ణించారు. అనుభూతి వాదిగా, అస్తిత్వ వాదానికి బలం చేకూర్చిన ఆధునిక రచయితగా, కవిత్వాన్ని మాధ్యమంగా చేసుకొని మాట్లాడిన కవిగా బైరాగిని ప్రత్యేకంగా చూపారు. బైరాగి రాసిన నూతిలో గొంతుకలు కావ్యంలో కవిగా ఆయన పరమావధి ఏమిటో స్పష్టంగా చెప్పారు. అమెరికా తెలుగు కథానిక – వస్తువైవిధ్యం అన్న వ్యాసంలో 2006లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన అమెరికా తెలుగు కథానిక అన్న తొమ్మిదో సంపుటిలోని కథల్లోని జీవిత చిత్రణను విశ్లేషించారు. భావుకత కలిగిన అభ్యుదయ కవి – ఆవంత్స సోమసుందర్ అన్న వ్యాసంలో దేశ ప్రజలను చైతన్య పరిచి వారి గుండెల్లో త్యాగశీలతను నింపడానికి కృషి చేసిన కవిగా సోమసుందర్ను చూపారు. విద్యాగంధం, ప్రాచీన సాహిత్య అధ్యయన శీలత, పాశ్చాత్య సాహిత్య వివేచనా దృక్పథం, కమ్యూనిజం నేర్పిన గతి తార్కిక భౌతికవాద దృష్టి కలిగిన విలక్షణ సాహితీ వేత్తగా సోమసుందర్ను చిరస్మరణీయమైన సాహితీవేత్తగా చూపారు. విస్తృతమైన వస్తువైవిధ్యం – దళిత దృక్కోణంలో స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ కావ్యం అన్న వ్యాసంలో బాబా సాహెబ్ అంబేద్కర్ చరిత్రను సవివరంగా పరామర్శించారు. జల్లి రాజగోపాలరావు అంబేద్కర్ పేరుతో రాసిన దీర్ఘకవిత పూర్తిగా దళిత దృక్కోణంలో శిల్ప, విషయ ప్రాధాన్యతతో ఎలా సాగిందో వివరించారు.
ద్రావిడ అస్తిత్వం ప్రకటించిన కన్నీటి గొంతు అన్న వ్యాసంలో రావణుడి చెల్లెలు శూర్పణఖ వేదనలోంచి పొంగిన కన్నీళ్ళు కావ్యమై ప్రవహించాయని వివరించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ కన్నీటి గొంతును ద్రావిడ స్త్రీ గొంతుక నుంచి వినిపించిన తీరును లోతుగా విశ్లేషించారు. శేషేంద్ర కవిత్వం – పరిణామం అన్న వ్యాసంలో భాషలు దాటి, రాజకీయ సరిహద్దులు దాటి, కొండలు దాటి, సముద్రాలు దాటి ఎక్కడెక్కడ మనిషి ఉన్నాడో అక్కడక్కడికంతా పరుగులెత్తే మనస్వితే కవిత అన్నట్టుగా కవిత్వం ఉండాలన్న శేషేంద్రశర్మ ఆకాంక్షను విస్తృతీకరించి చూపారు. వైవిధ్య రచన – గుంటూరు సాహిత్య చరిత్ర అన్న వ్యాసంలో తెలుగు సాహిత్య చరిత్రలో గుంటూరు సీమ సాహిత్య చరిత్ర ఒక విడదీయరాని భాగమని చెప్పారు. శ్రీనాథుడు, వేమన, జాషువా, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకటనర్సయ్య, త్రిపురనేని, తుమ్మల బలిజేపల్లి, కొండవీటి వెంకట కవి, కరుణశ్రీ, దుబ్బల దాసు, చిట్రిప్రొలు కృష్ణమూర్తితో పాటు ఇంకా అనేక మంది గుంటూరు సీమ సాహిత్యకారుల విశిష్ట సృజన వైశిష్టాన్ని వివరించారు.
గురజాడ స్వరం – మార్పుకు శ్రీకారం అన్న వ్యాసంలో 19వ శతాబ్దం వరకు భారతీయ సమాజ గొంతుకను నొక్కిపట్టిన డొల్ల సంప్రదాయాలను, జీవితాల్ని కాటేసిన నమ్మకాలను ఎండగట్టి నవ్య పథానికి వేగుచక్కగా, వెలుగుదారులు పరచిన మార్గదర్శిగా గురజాడను చూపారు. శాంతి అహింసలను బోధించిన కాందిశీకుడు కావ్యం అన్న వ్యాసంలో మహాకవి జాషువా చేతిలో పద్య ప్రక్రియ ఎంత ప్రతిభావంతంగా సాగిందో విశ్లేషించారు. జాషువా రచించిన కాందిశీకుడు కావ్యం ప్రపంచ శాంతిని, అహింసను ప్రతిపాదించిన తీరును, కల్పిత కథ అయినా సందర్భం ఎంత ప్రయోజనకరమైందో వివరించారు. మాడభూషి సంపత్కుమార్ కవిత్వం – జీవితం : సమన్వయం – సందేశం అన్న వ్యాసంలో జీవితమొక ఆకాశం, కవిత్వమొక సముద్రం అన్నంతగా కవిత్వాన్ని, జీవితాన్ని సంపూర్ణంగా నిర్వచించిన విమర్శకుడు సంపత్కుమార్ అని తెలిపారు. కవుల కవిత్వం జీవితం రెండూ పరస్పర పూరకాలేనన్న విషయాన్ని సంపత్కుమార్ తమ విమర్శ ద్వారా విశ్లేషించిన తీరును ఈ వ్యాసం వివరించింది. మానవీయతను అధిరోహించిన ఆరోహణ అన్న వ్యాసంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి నారాయణరెడ్డి కలం నుండి 1991లో రూపం పోసుకున్న ఆరోహణ సంపుటిలోని కవితలను విశ్లేషించారు. మానవీయత పొంగులెత్తిన కావ్యమే ఆరోహణ అని తెలిపారు. సినారె కవిత్వానికి మనిషే ప్రమాణమంటూ మనిషి నా పల్లవి అన్న కవితా వాక్యాలను ఉదాహ రించారు.
మినీ కవితకు సరికొత్త రూపం – రవ్వలు అన్న శీర్షికతో రాసిన వ్యాసంలో రచయిత విశ్వేశ్వర వర్మ భూపతిరాజు వేసిన కొత్త ప్రక్రియకు పునాది రవ్వలు అని తెలిపారు. పదునైన వాక్యాలతో మనసును పులకింపజేసే రవ్వలు ప్రక్రియ కవుల నూతన చైతన్యానికి నిదర్శనమన్నారు. నన్నయ్య సూక్తి – పునర్మూల్యాంకనం అన్న వ్యాసంలో నానార్థాలతో కూడిన సూక్తులను నిధి లాంటి నన్నయ కవిత్వ తత్వాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి చూపారు. తెలుగు కావ్యాల్లో శిల్పకళా సౌందర్యం అన్న వ్యాసంలో పుట్టపర్తి నారాయణాచార్యుల పెనుగొండలక్ష్మి, జాషువా తాజ్ మహల్ కావ్యాలలోని శిల్ప విశిష్టతను వివరించారు. ప్రపంచీకరణ ఊబిలో మగ్గం బతుకు అన్న వ్యాసంలో ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, విధాన లోపాలతో చేనేత వృత్తి చితికిపోతుందని, రైతన్నలు, నేతన్నలు చావులను వెతుక్కుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఆధునిక తెలుగు కవిత్వం – ప్రపం చీకరణ పర్యవసానాలు వ్యాసంలో ప్రపంచాన్ని ఆధునిక సాంకేతికత గ్లోబల్ గుడిసెగా మార్చేసినాక జరిగిన విధ్వంసంతో పాటు కార్పోరేట్ వ్యాపార విష సంస్కృతి మిగిల్చిన మానని గాయాలను వివరించారు.
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ జీవితం – సాహిత్యం అన్న వ్యాసంలో రాయలసీమ రాళ్ళలోనే పుట్టిన సృజన వజ్రంగా రాళ్ళపల్లిని ప్రస్తుతించారు. కవిగా, విమర్శకునిగా, గ్రంథ పరిష్కర్తగా రాళ్ళపల్లి అందించిన బహుముఖ సేవలను ప్రస్తావించారు. రాయలసీమ ఫ్యాక్షన్ కథలు – పరిశీలన అన్న వ్యాసంలో రాయలసీమలో కక్షలు ఏర్పడడానికి కారణమైన సామాజిక అంశాలను, పాలెగాళ్ళ నుండి సంక్రమించిన ఆధిపత్య భావజాల సంస్కృతి 20 వ శతాబ్దం వరకు కొనసాగిన తీరును, ఫ్యాక్షన్ కథలలోని వివిధ కోణాలను, శ్మదోపిడీ, పేదల వేదనల్ని స్పష్టంగా వెల్లడించి చూపారు. పరిష్కారం, చుక్క పొడిచింది, నవ వసంతం, ఊబి వంటి కథలను విశ్లేషించి చూపారు. ఈ గ్రంథంలోని వ్యాసాలు దాదాపుగా కవులకు, వారి కవిత్వానికి సంబంధించినవే కావడం గమనార్హం. అనాది నుండి నేటి దాకా సాహిత్యంలో కనిపించిన సమాజాన్ని ఇందులో ఉన్న పద్దెనమిది వ్యాసాలు పరిపూర్ణంగా పరామర్శించాయి.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764