ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో చూడాలి
పాఠ్యాంశంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
రుణమాఫీ అందరికీ వర్తింప చేయాల్సిందే
కవితకు బెయిల్పై రాజకీయ విమర్శలు సరికాదు
సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో పట్టింపులు ఎందుకని కూనంనేని ప్రశ్నించారు. ఇచ్చినవి ఇచ్చామని.. ఇవ్వనివి లేదని చెప్పాలని పేర్కొన్నారు. రేషన్ కార్డుకు నిబంధన ఎందుకని ఆయన ప్రశ్నించారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారని.. వారికి రుణమాఫీ చేయరా అని కూనంనేని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అందరికీ రుణమాఫీ చేయాలన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారని అన్నారు. చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ రంగనాథ్ మంచి మనిషి అని… పనిలో స్పీడ్ ఉందని కూనంనేని కొనియాడారు. చెరువులు, శికం భూమిలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
కవిత ఒక ఆడపిల్ల అని.. ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది కోర్టులు నిర్ధారిస్తా యని పేర్కొన్నారు. ఆడపిల్ల మీద అంత కక్ష ఎందుకు అని కూనంనేని ప్రశ్నించారు. రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే కేసీఆర్తో చూసుకోవాలని.. ఆమెపై రాజకీయం ఎందుకని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 ను అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని కూనంనేని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 ను అధికారికంగా చేస్తే ముస్లింలు వ్యతిరేకించరని తెలిపారు. అలాగే చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు అని స్పష్టం చేశారు. అది ముస్లిం, హిందువుల మధ్య జరిగిన ఘర్షణ కాదన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలన్నారు. హైడ్రాతో కబ్జా దారులు భయపడాలి. పేదల ఇళ్లు కూల్చకూడదని సూచించారు.