హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించే విధంగా రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి చొరవచూపాలని కోరారు. సచివాలయ ప్రాంగణంలోని మీడియా సెంటర్ లో మంత్రి పొన్నం మాట్లాడారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు జూలై 7 నుంచి గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాల వరకు శుభాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రత్యేకంగా హైదారాబాద్ కు సంబంధించి డిఎంఎఫ్టి నిధులు కేటాయించడం లేదని తెలిపారు. మెట్రో వాటర్ వర్కస్, మౌలిక సదుపాయాలు, చెరువుల అభివృద్ధి, 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు చొరవ ,మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అంశాలపై రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, పదేళ్లుగా తెలంగాణకు స్మార్ట్ సిటీల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు పెంచాలని, 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు పెంచలేదని, ఇప్పటికైనా పెంచాలని డిమాండ్ చేశారు. నవోదయ,సైనిక్ స్కూల్ లు మంజూరు చేయాలని, బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డి రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్ ని టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు తీసుకురావాలని, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ కు, ఉస్మానియా యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
17 మంది లోక్ సభ, 8 మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకొని కలిసి పనిచేస్తామని, ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలపై అధికారులతో కమిటీ తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం చేసుకుంటామని వివరించారు. పార్టీలు వేరు..రాష్ట్ర ప్రయోజనాల వేరని, తెలంగాణ ప్రయోజనాల కోసం మేమంతా కలిసి పని చేస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.