ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవిని రద్దు చేయాలి

కాంగ్రెస్ తో ఐక్యత ఉన్నా సమస్యలపై పోరాటం

హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హనుమకొండ : ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పార్టీ మారితే చట్టంలో ఉన్న లొసుగులతో అనర్హత విషయం ఏళ్ల తరబడి నానుతున్నదని, పార్టీ మారితే వెంటనే పదవి రద్దు చేయాలన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలను మోసం చేసినందుకు క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అస్థిత్వ పోరాటం చేస్తున్నదని, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల వల్ల గతంలో నష్ట పోయినందున కాంగ్రెస్ పార్టీ కూడా వాటిని ప్రోత్సాహించవద్దన్నారు. ఇటీవల అసెంబ్లీలో సరైన విధంగా చర్చలు జరుగడం లేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం వాగ్వివాదానికే సమయం సరిపోతున్నదని అన్నారు. రెండు పార్టీలు నిర్మాణ పద్దతులలో మాట్లాడకుండా గందరగోళం సృష్టించి సమయం వృదా చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని సకాలంలో నెరవేర్చే దిశగా సాగాలన్నారు.
నేటికి ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు, గ్రామ పంచాయతీలలో పనులకు పెండింగు బిల్లులు తదితర  సుమారు 70వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని, అలాగే సాకులు చెప్పకుండా అర్హులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని, ప్రభుత్వం రూ. 31వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి మూడు విడతలలో రూ. 18,540 కోట్లు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో సామాన్యుల ఇండ్లు కూలగొట్టడం సరికాదని, దశాబ్దాల నుండి నివసిస్తున్న వారికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, హైడ్రా వలన పేదలకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు. కాగా హనుమకొండలో మూడు రోజుల పాటు జరిగిన పార్టీ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలలో నిర్మాణ పరంగా చర్చలు జరిగాయని,ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు ఐక్యంగా ఉంటూనే మరోవైపు సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. తాము స్వతహాగా బలపడుతూనే అవసరం అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. ఇటీవల కాలంలో కమ్యూనిస్టులు లేని లోటును ప్రజలు గుర్తిస్తున్నారని, అసెంబ్లీలో ఒక్కరం ఉన్నా సమస్యలపై గళం ఎత్తుతున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పనిచేస్తామన్నారు. అలాగే సెప్టెంబర్ 2న అధిక ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే ధర్నాలలో పాల్గొంటామన్నారు. సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్. బాలమల్లేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ సారథి, జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కరుణాకర్,, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, షేక్ బాష్ మియా,ఎన్.అశోక్ స్టాలిన్,మండ సదాలక్ష్మి, నాయకులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి,కె.వెంకటరమణ,యేషబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page