దీపావళికి ముందే మిగిలిన వారికి రుణమాఫీ

త్వరలో రైతు భరోసా 
రైతులకు అనుకూలంగా ప్రభుత్వం
24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తాం
అనేక నిర్ణయాలు తీసుకున్నామన్న కోమటిరెడ్డి
పంటరుణం రూ.2 లక్షల కన్నా పైనున్న వారికి విడతల వారీగా డబ్బులు జమ
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి
నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌16:  ‌రైతు సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సపంలోని ఎస్‌ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్‌ ‌యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం పండుతుందని, రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే 24 గంటల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ వద్ద గతంలో బత్తాయి పండ్ల కోసం నిర్మించిన షెడ్డులో కోల్డ్ ‌స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రితో విజ్ఞప్తి చేశారు. అనంతపూర్‌ ‌తర్వాత నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా బత్తాయి సాగు జరుగుతుందని, సుమారు 50,000 ఎకరాలలో బత్తాయి సాగు చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ‌సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో భాగంగా నల్గొండ జిల్లాలో 375 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటి వరకే 152 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చామన్నారు. ఈ వారం చివరి వరకు అన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని, కొనుగోలు కేంద్రాలలో తేమ కొలిచే యంత్రాలు,తూకం యంత్రాలు, లారీలు, హమాలీల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రైతులకు వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు రెండు శుభవార్త లు చెప్పారు. నిడమానూర్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌ ‌రెడ్డి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల రైతు భరోసా, రూ.2లక్షల రుణమాఫీ గురించి ప్రస్తావించారు. దీపావళి పండుగ కంటే ముందే మిగిలిన 4లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. త్వరలో రైతు భరోసా కూడా అందిస్తామని అన్నారు. పంటరుణం రూ.2 లక్షల కన్నా పైనున్న వారికి విడతల వారీగా డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేపడతామని.. రూ.500 బోనస్‌ ‌కూడా ఇస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర రైతాంగానికి అనుగుణమైన పరిపాలన అందిస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు చిన్నాభిన్నమైయ్యాని మంత్రి తుమ్మల అన్నారు.  నల్గొండ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసి తీరుతామని తెలిపారు. కుందురు జానారెడ్డి1982 నుంచి రాజకీయాల్లొ తన చేయి పట్టుకొని నడిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు అన్నారు. తన రాజకీయ గురువు జానారెడ్డే అని ఆయన చెప్పారు.  రాష్ట్ర రాజకీయాల్లోతనను నిలబెట్టింది జానారెడ్డి అని చెప్పుకొచ్చారు.12  శాఖల మంత్రిగా పని చేసిన జానా రెడ్డి తన్ను ప్రోత్సహించారని అన్నారు. జానారెడ్డి రాజకీయం అంటే నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటాయని మంత్రి తుమ్మల చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page