తెలంగాణలోనే కొనసాగించాలని రిక్వెస్ట్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్14: తెలంగాణ కేడర్కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు సోమవారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ఈ మేరకు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన వేర్వురుగా క్యాట్లో పిటిషన్లు దాఖలు చేశారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్ అధికారులు కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అధికారుల పిటిషన్లపై క్యాట్ మంగళవారం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఏపీ విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్రం సర్దుబాటు చేసింది. ఈ సమయంలో ఐఏఎస్ అధికారులను ఏపీ, తెలంగాణ కేడర్లకు కేటాయించింది. అయితే, ఇందులో కొందరు అధికారులు తమను ఏపీ కేడర్కు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ కేడర్గా గుర్తించాలని కోరుతూ పలు కారణాలను చూపించారు. అయితే, ఈ విషయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ను ఆశ్రయించగా.. అధికారుల అభ్యర్థనను క్యాట్ పరిగణలోకి తీసుకున్నది. అయితే, ఈ తీర్పును డీఓపీటీ తెలంగాణ హైకోర్టు సవాల్ చేసింది. 2023 మార్చిలో పిటిషన్పై విచారించింది. అధికారుల అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిషన్ను కేంద్రం ఈ ఏడాది మార్చి 21న ఏర్పాటు చేసింది. కమిటీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను పరిశీలించింది. వ్యక్తిగతంగానూ విచారించి.. అభ్యర్థలను తిరస్కరించింది. ఈ క్రమంలో డీఓపీటీ ఏపీ కేడర్కు కేటాయించిన ఆలిండియా సర్వీస్ అధికారులను ఏపీ కేడర్కు వెళ్లాల్సిందిగా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ స్పష్టం చేసింది. అయితే, డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ నలుగురు అధికారులు క్యాట్ని ఆశ్రయించారు.