ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి
ఎక్స్వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12:కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్వేదికగా కాంగ్రెస్ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారన్నారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారం కోసం అబద్ధాలు చెప్పారని, అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు వెతుకుతున్నారని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను.. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. వర్షం కురుస్తుందో లేదో, సాగునీరు, కరెంట్, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో.. లేదో? అని తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దని కేటీఆర్ అన్నారు.