Eturunagaram Encounter | ఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోతతో దద్దరిల్లిపోయింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టగా.. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా .. ఏడుగురు నక్సల్స్ మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నాడు. కాగా
ఘటనాస్థలంలో రెండు AK-47 రైఫిల్స్ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాగా, మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారు. 1 ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35)
ఏటూరునాగారం మహదేశ్పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23),
జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నారు.
ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. 14 ఏండ్ల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం విశేషం. గుర్తించినట్లు తెలిసింది పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
తెలంగాణలో మరోసారి..
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధి నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూబింగ్ చేపట్టగా… వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా తెలంగాణలో ఎన్ కౌంటర్ జరిగింది.
తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు బాగా తగ్గిపోయాయి. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. సెప్టెంబర్లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్కు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్లో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు హతమయ్యాడు. మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 250కు పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.
ప్రజాసంఘాల నుంచి విమర్శలు..
కాగా గత బిఆర్ ఎస్ ప్రభుత్వం తొలినాళ్లలో వరంగల్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరగగా ప్రజా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అప్పటి నుంచి చెప్పుకోదగ్గ భారీ ఎన్ కౌంటర్లు జరగలేదు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి ఏడాది కాకముందే పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లు జరుగుతుండడంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వొస్తోంది. ఎన్నికల సమయంలోనూ మంత్రి సీతక్క ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా పలుమార్లు గళమెత్తారు. కానీ ఆమె ఇలాఖాలో వరుస ఎన్ కౌంటర్లు చోటుచేసుకోవడం గమనార్హం.