– గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ఇతర రాష్ట్రాలలో సాధారణంగా ఒక్క గిరిజన మ్యూజియం మాత్రమే ఉండగా తెలంగాణలో ఆరు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ బి.ఎమ్ అన్నారు. వేగంగా మారుతున్న ఆధునిక సమాజంలో గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానం, విలువలు తదితర వారసత్వ సంపదను భావితరాలకు పరిచయం చేసే ప్రధాన వేదికలుగా మ్యూజియంలు నిలుస్తాయన్నారు. హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ శత జయంతి ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీమ్, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుమ్రం భీమ్, రాంజీ గోండ్ వంటి గిరిజన వీరులు ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాభిమానాల కోసం చేసిన పోరాటాలు, త్యాగాలు తదితర చారిత్రక అంశాలను యువతకు తెలియజేయడంలో గిరిజన మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు, యువత ఆసక్తిగా నేర్చుకునే విధంగా గిరిజన మ్యూజియంలను ఇంటరాక్టివ్, డిజిటల్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నవంబర్ 15 నాటికి రాంజీ గోండ్ స్మారక గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను అత్యాధునిక హంగులతో పూర్తి చేసి ప్రధానమంత్రిని ఆహ్వానించి ఆవిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వర్ రెడ్డి, టి.ఆర్.ఐ డైరెక్టర్ సముజ్వల, మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





