- కొండా సురేఖకు ఉద్వాసన తప్పదా ..?
- రెండు రోజుల్లో విస్తరణ పై నిర్ణయం
( మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
దసరాకు మంత్రివర్గ విస్తరణ తప్పకుండా జరుగుతుందని ఆశావహులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుండి మంత్రివర్గాన్ని విస్తరించే విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తూనేఉన్నాయి. అయితే ఏదో ఒక కారణంతో మంత్రివర్గ విస్తరణ వాయిదాపడుతూ వొచ్చింది. తాజాగా జమ్మూ కాశ్మీర్, హర్యాన ఎన్నికల్లో అధిష్టానం బిజీబిజీగా ఉండటంవల్ల కూడా ఈ ప్రకటన వాయిదా పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివిధ కారణాలతో అధిష్టానాన్ని కలుసుకోవడానికి ఈ పదినెలల కాలంలో దాదాపుగా ఇరవై నుండి ఇరవై అయిదు సార్లు అయినా దిల్లీ వెళ్ళి ఉంటారు. ఆయన వెళ్ళినప్పుడల్లా వెంట డిప్యూటి సిఎంతోపాటు క్యాబినెట్లోని ముఖ్యమైన మంత్రులుకూడా దిల్లీ పర్యటనలో ఉంటూనే ఉన్నారు. వెళ్ళిన ప్రతీసారి దాదాపుగా మంత్రివర్గ విస్తీరణ విషయంలో అధిష్టానంతో చర్చజరుపుతున్నట్లుగానే తెలుస్తున్నది.
తాజాగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిల్లీ పర్యటనపైన మాత్రం ఆశావహులు మరింత ఆశపెట్టుకున్నారు. ఎందుకంటే ఈ నెల మొదటివారంలోనే ముఖ్యమంత్రి దిల్లీ వెళ్ళినప్పటికే కొత్తగా మంత్రిపదవులను చేపట్టేవారి జాబితా దాదాపుగా ఫైనల్ అయిందన్న వార్తలు వొచ్చాయి. ఏఐసిసీ కూడా ఆ జాబితా ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రకటించడమే తరువాయి అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపైన అధిష్టానం అసంతృప్తితో ఉండడంతో, మంత్రివర్గ విస్తరణకు ముందు మరోసారి అధిష్టానంతో వాస్తవ పరిస్థితిపైన ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారమే దిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన అమిత్షాతో సమావేశమై ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరదనష్టాన్ని వివరించి అధిక నిధులను సమకూర్చాల్సిందిగా కోరినట్లు తెలుస్తున్నది. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్న మూసీ ప్రక్షాళన విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. నమామి గంగేకు అర్థిక సహకారాన్ని అందించినట్లు మూసీకి కూడా నిధులు సమకూర్చాలని ఆయన అమిత్షాను కోరినట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్తో కూడా సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తున్నది. రాష్ట్రమంత్రివర్గంలో మరో ఆరుగురికి మంత్రి పదవులను కల్పించే అవకాశముంది. పోటీ పడుతున్న ఎమ్మెల్యే ల్లో చాలామంది సీనియర్లు కావడంతో ఎవరిని తీసుకోవాలన్న విషయంలో అధిష్టానం రాష్ట్ర నాయకులతో తీవ్ర కసరత్తు చేస్తూ వొస్తున్నది. పార్టీలోని సీనియర్లతో పాటు, ఇతర పార్టీల నుంచి వొచ్చినవారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో జరుగుతున్న వడపోతతో పదినెలలుగా ఈ విషయం పెండింగ్ పడుతున్నది. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల పైన రెండు మూడు శాఖల భారం పడుతుండడంతో తమ శాఖలను మార్చాలన్న విజ్ఞప్తులు వొస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో మంత్రివర్గ విస్తరణతోపాటు, ప్రస్తుత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే అటవిశాఖ మంత్రి కొండా సురేఖ వివాదం రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది.
అయితే విపక్షాలు, సినీ వర్గాలనుండి వొస్తున్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీపై ప్రభావాన్ని చూపించకుండా ఆమెను మంత్రివర్గంనుండి తప్పించే అవకాశాలున్నాయన్న వార్తలు వొస్తున్నాయి. అయితే పార్టీపరంగా చర్య తీసుకునే కన్నా, ఆమెనే స్వచ్చందంగా మంత్రి పదవిని వదులుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఖాలీ అయ్యే ఆస్థానాన్ని కలుపుకుంటే ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉంటుంది. అయితే సీనియర్ నాయకురాలు, వెనుకబడిన తరగతులనుండి ఎదిగివొచ్చిన కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే మరో విధంగా ఆ వివాదానికి ముగింపు పలుకాలన్న ఆలోచనకూడా ఒకటుందన్న వాదన కూడా ఒకటుంది. సోమవారం రాత్రి లేదా మంగళవారం దిల్లీనుండి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. ఆయన వొచ్చినవెంటనే మంత్రివర్గంలో కొత్తగా చేర్చుకునేపేర్లను ప్రకటించే అవకాశాలపై పలువురు ఎమ్మెల్యే లు ఆశగా ఎదురుచూస్తున్నారు.