ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో మహిళా క్రికెటర్ గొంగడి త్రిష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను ఈసందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ అభినందించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
క్రికెటర్ త్రిష కు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు ప్రకటించారు. అలాగే అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున నజరానా ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు తదితరులు పాల్గొన్నారు.