ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్ణాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం గుర్తుచేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి దుర్గామాతను ప్రార్థించారు.