- విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ త్వరలో అందుబాటులోకి తీసుకు వొస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగలపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ రావడం సంతోషకరమని అన్నారు. తాము అధికారంలోకి రాగానే విద్య ,వైద్యం, టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన దృష్టి సారించామని తెలిపారు.
జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్ గా విద్య ను అంతర్జాతీయ స్థాయిలో అందించనున్నట్లు తెలిపారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేలా భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 25 వేల పాఠశాలలకు రూ.1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని, స్కూల్స్కు ఉచిత విద్యుత్, తాగునీరు, శానిటేషన్ సిబ్బంది కి జీతాలపై ప్రత్యేక చొరవ తీసుకున్నామని చెప్పారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు 19 వేల ప్రమోషన్లు, 35 వేల బదిలీలు చేశామని, డీఎస్సీ ద్వారా 10 వేల మందికి నియామక పత్రాలు అందించామని తెలిపారు. గురుకుల లో మెస్ బకాయిలు చెల్లించడంతో పాటు, అద్దె బకాయిలు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచనతో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు సిద్ధమవుతున్నాయని చెప్పారు.
రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం చేపడుతున్నామని, రూ.180 కోట్లతో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు ఈ పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూల్ ఆ రోజులోనే తెచ్చామని, ఇన్నోవేషన్ పార్కుకు త్వరలోనే భూమి పూజ చేస్తామని చెప్పారు. బస్వపూర్ లో కృషి విజ్ఞాన కేంద్రానికి స్థల పరిశీలన చేశామని, త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు. సర్వాయిపేటలో టూరిజం హబ్ ,ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి 37 కోట్లు కేటాయించామని, అక్కన్నపేటలో పరిశ్రమల హబ్ ఏర్పాటు చేస్తామనితెలిపారు. ఎల్కతుర్తిలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ స్థలాలు జాగ్రత్తగా కాపాడుకోవాలని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ అకాడమీ వొచ్చింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ వొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తుందని అన్నారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల 20-25 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని, నాణ్యమైన విద్య, వసతి ఇక్కడ కల్పిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో హుస్నాబాద్, కొడంగల్, మధిర, మంథని , హుజూర్ నగర్, ములుగు, ఖమ్మం, మానకొండూరు తదితర ప్రాంతాల్లో శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఒక్కో స్కూల్ లో 2560 మంది విద్యార్థులు ప్రాథమిక దశ 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతి స్కూల్ లో 120 మంది వరకు టీచర్స్ ఉంటారని,
ప్రతి తరగతి డిజిటల్ స్మార్ట్ బోర్డు లు, కంప్యూటర్ సెంటర్లు, 5 వేలకు పైగా పుస్తకాలతో లైబ్రరీ అనుసంధానం చేసి ఉంటాయన్నారు. అన్ని రకాల వాతావరణాలకు అనుగుణంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ లను డిజైన్ చేశారని చెప్పారు. .
ప్రతి కాంప్లెక్స్ లో డిజిటల్ తరగతి గదులు, ల్యాబొరేటరీలు , కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం , క్రీడలను ప్రోత్సహించేలా ఇండోర్ స్పోర్ట్స్ , క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, టెన్నిస్, ఔట్ డోర్ జిమ్స్, థియేటర్,ల్యాండ్ స్కేప్ కోర్టులు ఉండనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
కుల,మత వర్గ అంతరం లేని విద్యా సౌధం నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో పోటీ తత్వాన్ని అలవర్చుకొని శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు నంబర్ 1 గా నిలుస్తాయని ఆశాభావంవ్యక్తం చేశారు. .
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు గ్రీన్ ఎనర్జీ ద్వారా సొంతంగా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునేలా చేశామన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర ..ఒక కుటుంబంలగా చదువుకునేలా ఇవి ఉండబోతున్నాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో, ఎమ్మార్వో, కాంగ్రెస్ ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.





