కార్మికుల‌ ప్రాణాలకు విలువ లేదా?

ఒక వైపు ప్రమాదం జరిగితే… ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ : ‌
మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు, కూలీల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రోమ్‌ ‌ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి సిద్ధమయ్యారని కేటీఆర్‌ ‌విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్‌నెస్‌ ‌లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎలా ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్‌ ఎలా ముందుకు సాగుతుంద‌ని ప్రశ్నించారు.

వోట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌కు వెళ్లే టైమ్‌ ‌లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటే నోట్ల వేట.. వోట్ల వేట మాత్రమేనా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి, సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాత పెడ్తారని ఎక్స్ ‌వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page