- ఉస్మానియా వర్సిటీ వీసీగా ఎం.కుమార్
- తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు
తెలంగాణలో పలు యూనివర్శిటీలకు కొత్త వైస్ చాన్సలర్లను నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 21తో వీసీల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం అన్ని యూనివర్శిటీలకు ఇన్చార్జ్ వీసీలుగా ఐఏఎస్లు వ్యవహరిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్శిటీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 10 యూనివర్శిటీలకు తెలంగాణ ప్రభుత్వం గతంలో సెర్చ్ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు దరఖాస్తులను పరిశీలించి ఒక్కో యూనివర్శిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్కి సిఫారసు చేస్తాయి. పది వీసీ పోస్టులకు 312 మంది దరఖాస్తు చేసుకున్నారు.
కొత్తగా నియమితులై వీసీల్లో అనుభవం, కులాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో పాలమూరు యూనివర్శిటీ వీసీగా జి.ఎస్. శ్రీనివాస్, కాకతీయ యూనివర్శిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం.కుమార్, శాతవాహన వర్శిటీ వీసీగా ఉమేష్ కుమార్ తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్శిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, జయశంకర్ వర్శిటీ వీసీగా జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టీకల్చర్ వర్సిటీ విసిగా రాజిరెడ్డిలు నియమితులయ్యారు. ప్రభుత్వ సూచనలతో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. తెలంగాణలో చాలా కాలంగా వీసీల పోస్టులు ఖాలీగా ఉన్న విషయం తెలిసిందే.
దాదాపు ఏడాదిన్నర కాలంగా వీసీలు లేకుండా పోయారు. అంతేకాదు ఇన్చార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్లను నియమించినప్పటికీ వర్సిటీలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. వీసీలు లేక అనేక యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పిన్లటైంది. పలు వర్సిటీల్లో అక్రమాలు జరిగాయని కూడా ఆరోపణలు వొచ్చాయి. సరైన వసతులు లేక అనేకసార్లు విద్యార్థులు ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని కొత్త వీసీలను నియమించాలని విద్యార్థులు పట్టుబట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వసతి గృహాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. హాస్టల్స్లో సరైన భోజన సదుపాయం లేక, నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు అవస్థలు పడ్డ సందర్భాలు ఎన్నో. అంతేకాకుండా హాస్టల్స్లో విషపు పురుగులు తిరుగుతుండటంతో విద్యార్థులు మరింత భయాందోళనకు గురైన పరిస్థితులు ఉన్నాయి.అలాగే వీసీ పోస్టుల కోసం అనేక మంది ప్రొఫెసర్లు పైరవీలు చేసినట్లు సమాచారం. చివరకు ఎట్టకేలకు వీసీల నియామకంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వీసీల ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో పరిస్థితి మారుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.