వంద శాతం రాయితీతో రూ. 50 వేల యూనిట్లు
తెలంగాణ రాష్ట్రంలో యువ వికాసం పథకం నిరుద్యోగులకు వరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ప్రత్యేకంగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సహాయం చేయడానికి ప్రభుత్వం వివిధ చర్యలను అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు మండలాలు, సంక్షేమ వర్గాల జనాభా ఆధారంగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. రూ.50 వేల విలువైన యూనిట్లకు 100 శాతం రాయితీ కల్పిస్తారు.
పథకం విధివిధానాలు ఇవీ..
ఈ పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విధి విధానాలు ఇలా ఉన్నాయి. కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు.. దీనిలో వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న వారికి.. స్వయం ఉపాధిలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ను పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసి.. సంబంధిత పత్రాలను జతచేసి మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలి.
ఇటువంటి పథకాల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల రూపాయల కుటుంబ ఆదాయం, పట్టణాల్లో 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు ఈ పథకంలో భాగస్వామి కావచ్చు. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన పత్రాలు జతచేయాలి. వాటిలో రేషన్కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ఎంపికైన వారికి 15 రోజుల పాట ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు.
ఆ తర్వాత యూనిట్లను మంజూరు చేసి.. అవసరం అయిన వారికి సహాయం చేస్తారు. ఇక యూనిట్ గ్రౌండ్ చేసిన వారికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిపుణుల ఆధ్వర్యంలో సాంకేతిక శిక్షణ ఇస్తారు. వ్యవసాయం కాకుండా ఇతర పథకాలకు దరఖాస్తు చేసిన వారి వయస్సు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వ్యవసాయ పథకాలకు అయితే 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఏప్రిల్ 5 చివరి తేదీగా నిర్ణయించారు. తర్వాత ఏప్రిల్ 6 నుంచి 20 వరకు మండలస్థాయి కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. జూన్ 2 తర్వాత అర్హులకు మంజూరు పత్రాలు జారీ చేస్తారు.