దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు
2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా 2 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్లో డెహ్రా మరియు నలాగఢ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, హమీర్పూర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్లోని అమరవారాలో బీజేపీ విజయం సాధించింది.
పంజాబ్లో జలంధర్ వెస్ట్లో ఆప్ విజయం సాధించగా, తమిళనాడులోని విక్రవాండి స్థానాన్ని డీఎంకే కైవసం చేసుకుంది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో రాయ్గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్తలా స్థానాల్లో టిఎంసి విజయం సాధించింది. ఇక బీహార్లోని రూపాలీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందారు. కాగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ఉన్న మొత్తం 5 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా కేవలం రెండు నెలల అనంతరం ప్రస్తుతం అసెంబ్లీకి జరిగిన రెండు స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకోవడం గమనించ దగ్గ విషయం.