పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో సెషన్ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బీజేపీ సానుకూల సంకేతాలు ఇచ్చింది. అయితే కులగణన మాత్రం ససేమిరా అంటోంది. దేశంలో కుల చిచ్చు రగల్చడం సరికాదని బిజెపి వాదిస్తోంది. నిజానికి ఇప్పుడున్న కాలంలో ఇంకా కులాల కుంపట్లు పట్టుకుని వేలాడుతామంటే కుదరదు. తెలంగాణ, బీహార్లో కులగణన చేసినా పెద్దగా ఒరిగిందేవిూ లేదు. కులాల వోట్లు పొందేందుకు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా తప్ప మరోటి కాదు. మరో ముఖ్య విషయం నియోజకవర్గాల పునర్విభజన అంశం.
దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల గణన చేస్తే తాము నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సీట్లు తగ్గవని అంటున్న బీజేపీ..ఏ సీట్లు తగ్గవో స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికే తమిళనాడు సిఎం స్టాలిన్ దీనిపై యుద్దం మొదలు పెట్టారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసారు. తగ్గిన జనాభా కారణంగా నియోజకవర్గాల కుదింపు కుట్రలు జరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా దానికి కొనసాగింపుగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా పల్లవి అందుకున్నారు. సీట్ల తగ్గింపు జరగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కూడా సీట్లు పెరుగుతాయా లేదా అన్నది బిజెపి స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో ఇది విపక్షాలకు ప్రధాన ఎజెండా కానుంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటివి రానున్న ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని బిజెపి పట్టుదలగా ఉంది. ఆ తర్వాత జమిలి ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికే జమిలి ఫీవర్ పట్టుకుంది. జమిలి ఎన్నికలు జరిపి తీరుతామన్న పట్టుదలలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని విపక్షాలు ఇప్పటికే వాదిస్తున్నాయి. ఎందుకంటే వారికి నిరంతర ఎన్నికల ప్రక్రియ ఉంటేనే జీవితం గడవదు. అయితే జమిలి ఎన్నికలతో వచ్చే నష్టం లేదు. తరచూ ఎన్నికల వల్ల దేశ ఖజానాకు భారం పడుతుంది . అలాగే రాజకీయ నాయకులు నిత్యం ఎన్నికలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలు ఎన్నికల గాలికి కొట్టుకు పోతున్నాయి. దేశాన్ని గాడిలో పెట్టాలంటే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ మోదీ ప్రభుత్వం చేయగలుగుతుందా..అంతటి చిత్తశుద్ది ఉందా అన్నది చూడాలి. ప్రధానంగా జమిలికి ముందే దేశ జనాభా గణన జరగాలి. దీంతోపాటే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి తీసుకుని రావాలి. ఎవరెన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, రాజకీయ పోరాటం చేసినా..దేశానికంతటికీ ఒకే దేశం, ఒకే చట్టం అమల్లోకి రావాలి. అలాగే ప్రధానంగా పెరుగుతున్న జనాభాను కట్టడి చేయాలి. ఇందులో కులమతాలకు తావులేకుండా చేయాలి. ఇవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సాధారణంగా లోక్సభ, శాసనసభల నియోజక వర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దేశంలో భిన్నత్వాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటేలా చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా సీట్ల కేటాయింపు ఉంటుంది. దేశ, రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకొని లోక్సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. కొత్తగా లెక్కించే జనాభా ఆధారంగా శాసనసభ, లోక్సభ సీట్లు పెరుగుతాయని రాజకీయవర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. సీట్లు పెరిగితే తమకు ప్రాతినిధ్యం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే రాజకీయ పదవులను తగ్గించే పని కూడా చేపడితే మంచిది. రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థతో పాటు శాసనమండలులు కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉన్నాయి. వీటిని శాశ్వతంగా ఎత్తేస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు మాత్రమే పరిమితం కాకుండా లోక్సభ, శాసనసభల సీట్ల సంఖ్యను కూడా పెంచాలని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఎన్ని సీట్లు పెంచితే అన్ని విధాలుగా లబ్ది పొందేది కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే.
దేశంలో లోక్సభ సీట్లను పెంచితే మాత్రం దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అందుకే దేశ ప్రజల దృష్టి 2025 లో జరగనున్న జనాభా లెక్కలపై పడింది. ఇకపోతే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించారు. దీనికి జనాభగణను లింక్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో జనగణన కీలకంగా ఉంది. 2023లో ఈ బిల్లు 106 వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా మారింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జనగణన పూర్తయిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకుని వస్తామని హావిూ ఇచ్చింది. ఆ మేరకు చట్టంలో కూడా పొందుపరిచింది. అందుకే, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రావాలంటే కచ్చితంగా జనగణన జరిగితీరాలి. అప్పుడే మహిళల దశాబ్దాల కల సాకారమవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. మహిళా రిజర్వేషన్ల ద్వారా దేశంలో విభిన్న ప్రాంతాలకు చెందిన మహిళలు చట్టసభల్లోకి ప్రవేశించేందుకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
-కందుల శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
98484 43599
సీనియర్ జర్నలిస్ట్
98484 43599