ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
•మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ
ఎస్సీ వర్గీకరణపై చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం మర్యాపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రణాళికపై ఆయన సీఎంతో చర్చించారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను మంద కృష్ణ మాదిగ అభినందించారు.
ఒక కమిట్మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మంద కృష్ణ పేర్కొన్నారు. మాదిగ ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు.
దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామన్నారు. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణలో ఎదురయ్యే సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి మంద కృష్ణ మాదిగకు సూచించారు.