– సెంట్రలైజ్డ్ కిచెన్స్ పరిసర ప్రాంతాల్లో దృష్టి పెట్టండి
– ఆర్గానిక్ సాగు దిశగా రైతులకు అవగాహన కల్పించండి
– నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నివేదికను అందజేసిన కమిటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్టెన్షన్ అధికారులను నియమించి సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువారం సమర్పించింది. నివేదికలో కమిటీ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాక వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. గ్రామాలవారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి ప్రత్యామ్నాయ పంటలు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని తెలిపింది. 75శాతం సబ్సిడీతో ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది. గత ఏడాది ఈ సీజన్ లో 79.49 లక్షల ఎకరాలు సాగవగా, ఈ ఏడాది 74.56 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యాయని పేర్కొంది. పత్తి పంట 45 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు, వరి 14.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన పంటల సాగు ఉందని నివేదికలో తెలిపింది. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో 75 నుంచి 90శాతం సబ్సిడీ అందించి డ్రిప్, స్ప్రింకర్ల సాగు పద్ధతులను ప్రోత్సహించాలని సూచించింది. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై అందించి పశు గ్రాస సాగును ప్రోత్సహించాలని, సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని తెలిపింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలంది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో పేర్కొంది. గ్రామీ ణ ప్రాంతాల్లో డెయిరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించాలని, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు కృపాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయం మీడియా సెంటర్ లో డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రైతులకు నష్టం తగ్గించేలా నీటి వినియోగంలో పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల అందుబాటు, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు వంటి అంశాలకు నివేదికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వర్షాలతో రైతులకు ఊరట
మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు ఊరటనిచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. ఈ వర్షాలతో లభించిన తేమను, అందుబాటులోకి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలను విజయవంతంగా సాగు చేసుకునేలా ప్రభుత్వం అమలు చేయదగిన ఆచరణాత్మక సూచనలను కమిటీ ప్రభుత్వానికి అందజేసి నట్లు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





