మంత్రి దామోదర రాజనర్సింహ
భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17 : రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్’ సంఘటన పై మంత్రి దామోదర స్పందించారు. జరిగిన ఘటన పై 108 – సీవోవో ఖాలీద్ ను విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తు లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 108 సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందన్నారు. అత్యవసర పరిస్థితులలో రోగులకు సేవలు అందించే 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్, పట్టణ ప్రాంతాలలో ఏదైనా అత్యవసర పరిస్థితులలో 108 నెంబర్ కు సమాచారం వొచ్చిన వెంటనే మిషన్ ఆఫ్ సేవింగ్ లైవ్స్ లో భాగంగా అత్యల్ప సమయం లో ఘటనాస్థలానికి వేగంగా చేరుకొని ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గర లోని హాస్పిటల్ కు తరలిస్తారన్నారు . అత్యల్ప సమయంలో ఘటన స్థలానికి వేగంగా చేరుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు అంబులెన్స్ ద్వారా తరలించి తక్షణ చికిత్స ను అందించేలా భౌగోళికంగా నెట్వర్క్ ను రూపొందిస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ.
అన్నారు