‘‘తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెధవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధృడ! చావవేటికిరా. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత మాటల మాంత్రికుడు ధిక్కార స్వరాన్ని వినిపించి, అందరి గొడవను తన గొడవగా భావించిన అక్షర యోధుడు మన కాళోజీ నారాయణ రావు. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ సెప్టెంబరు 9, 1914న జన్మించారు. కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్నగా సుపరిచితులు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి, గొంతుక కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్య్రసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవిస్తున్నది.
వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914, సెప్టెంబరు 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషుభాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడిరచాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి హన్మకొండకి తరలివొచ్చిన కాళోజీ కుటుంబం మడి కొండలో స్థిరపడిరది. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీలోనూ, హన్మకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు.
1939 లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రం లో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు.
స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియావిశ్వవిద్యాలయంవిద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర ఎనలేనిది.1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ ‘‘సామాన్యుడే నా దేవుడు’’ అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13న తుదిశ్వాస విడిచారు. అతని మరణానంతరం ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు. కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. కాళోజీ రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి. తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద. కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి చురుకుతనం వల్ల ఆయన ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా కలిసిమెలిసి బతికారు. న్యాయ శాస్త్రం చదివుండీ కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా ఆయనే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా జీవింస్తూ వొచ్చాడు.
1996లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప.’ అన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ‘‘ఆంధ్ర సారస్వత పరిషత్’’ వ్యవస్థాపక సభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు. ఆయన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగానూ 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ ఉన్నారు. 1977లోసత్తుపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పై పోటీ చేశాడు.. కానీ ఓడిపోయాడు. 1943లోనే ఆయన కథల్ని ‘‘కాళోజీ కథలు’’ పేరుతో అప్పట్లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది. నిజాం రాజు ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించాడు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించారు. 1939, 1943లో రెండుసార్లు జైలుకి పోవాల్సి వొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ కోరినాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ వాదించిన ధీశాలి కాళోజీ మాత్రమే అని చెప్పవచ్చు. ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణలలో కాళోజి ప్రమేయం మెండుగా ఉంది.
పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంలో, రాజకీయాల్లో మార్గదర్శనం చేశారు. విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969 లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశారు. ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా . ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక, పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ ఇలాంటి ఎన్నో మాటలు చెప్పిన కాళోజీ జీవితాంతం తెలంగాణ వాదిగా జీవించారు. వీరు నవంబరు 13,2002న మరణించారు. వీరి జయంతి ని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం గా పాటిస్తారు..వీరి జీవిత చరిత్ర ని ప్రతి కవి, రచయిత అధ్యయనం చేయాలి. ప్రతీ ఏటా వీరి జయంతి సందర్బంగా అందచేసే కాళోజీ నారాయణరావు పురస్కారంను ప్రముఖ కవి నలిమెల భాస్కర్ కు అంద చేశారు. ప్రతి ఒక్కరూ వీరిని స్పూర్తి గా తీసుకుని రచనలు చేయాలి. ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకొవాలి. అన్ని జిల్లాలలొ వీరి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలి. హన్మకొ%శీ%డ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రం త్వరలో ముఖ్య మంత్రి, రాష్ట్ర మంత్రులు, అధికారుల చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
-కామిడి సతీష్ రెడ్డి
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు, భూపాల్పల్లి జిల్లా
సెల్: 9848445134