బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః
‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది.
మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన పాశురములను అనుగ్రహిం చినది. ‘‘మార్గళంగల్ మదినిజైన్ద నన్నాళాల్ మార్గశిరము వచ్చినది. పూర్ణ చంద్రునితో కూడిన శుక్లపక్షము – వైష్ణవమాసము – మార్గశీర్షము అనగా భగవంతుని పొందుదారి- ‘‘నారాయణనే నమక్కే’’ అని శరణాగతి. భాగవతం దశమ స్కంధంలోనే భగవంతుని వెదకెడి ద్రోవలో హేమంతంలో ప్రధమ మాసంలో నందప్రజ కుమారికలు భగవత్ ప్రసాదం ‘‘హవిష్యం భుంజాన:’’ కాత్యాయనీ వ్రతం చేయుటకు పూనుకొన్నారని ప్రమాణం ఉన్నది. భాగవత దశమ స్కందంలో బమ్మెర పోతనామాత్యుడు, గోపభామలు ‘‘మార్గశీర్షవ్రతం’’ జరిపారని పేర్కొన్నాడు. జ్ఞానమును పెంపొందించే ధనుర్మాసంలో ఓంకారాన్ని ధనువుగా, ఆత్మను బాణంగా, బ్రహ్మమును లక్ష్యంగా చేసుకుని, సాధకులు నిర్మల, నిశ్చల మనస్కులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేస్తే, త్వరగా లక్ష్య సిద్ధి కలగు తుందనేది విశ్వాసం. కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాల్ని అనుసరిస్తారు. వాటిలో చాంద్రమాన, సౌర మానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు.
సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం కాగా ధనుస్సులో సూర్యు డుండే కాలము ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశి లోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను… సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలై, తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది.
దక్షిణాయనానికి చివర, ఉత్తరాయ ణాయనానికి ముందుడే ధను ర్మాసం పరమ పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదా యాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లె సీమల్లో సంక్రాంతి నెల పట్టడము అంటారు.
ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని పురాణాల ఆధారం. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగ నాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెపుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు.
రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం, వైష్ణవ ఆలయాలను సందర్శిం చడం శుభప్రదం. ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని, తలస్నానం చేసి నిత్య పూజలు ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు తెల్పుతున్నాయి. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాతి ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవి రూపంగా పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారు. నెల రోజులూ హరిదాసుల కీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడిరచే వారితో సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబ రాలతో పల్లెలు ‘‘సంక్రాంతి ‘‘పండుగ కోసం ఎదురుచూస్తూ ఉండే కాలం ఇది.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494