కాళేశ్వరం పై అధికార ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు?

V-Sankaraiahకెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తనే చీఫ్ ఇంజనీర్ గా పర్యవేక్షించుతూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణ లోపాలు బయట పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై జరిగిన తతంగం ప్రత్యేకంగా చెప్ప పని లేదు. అయితే ఘోష్ కమిషన్ రిపోర్టు మాత్రం కీలకంగా మిగిలింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎల్ నినో ఏర్పడి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిర్మాణ లోపాలతో ఉపయోగించకుండా వదిలేసి ఉన్న  కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ లను ఏ విధంగానైనా ఉపయోగంలోనికి తీసుకు వచ్చి తెలంగాణ రైతులను ఆదుకొన్నదని రుజువు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమంగా పూనుకొన్నది. ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దెబ్బ తిన లేదని తెలియ జెప్పడానికి సకల యత్నాలు చేస్తోంది. తన మీడియా నిండుగా రోజూ పేజీల కొద్ది కథనాలు వండి వార్చుతోంది. తమకు అప్పగించితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ లను పని చేయిస్తామని సవాలు విసురుతోంది. అంతిమ అస్త్రంగా రిటైర్డ్ ఇంజనీర్స్ సంఘం నేతల చేత కూడా ఒక ఫార్ములా ప్రకటింప జేసింది. అంది వచ్చిన ప్రతి ఆయుధం ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తను తక్కువగా లేదని దీటైన సమాధానం ఇచ్చారు. గణాంకాలతో సహా వివరించి అంతిమంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ లను ఉపయోగంలోనికి తేవడం తన చేతుల్లో ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ చేసిన సూచనలను అమలు చేస్తున్నట్లు తేల్చి వేశారు. పైగా రిటైర్డ్ ఇంజనీర్స్ సంఘానికి స్వార్థముందని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో కొందరి పాత్ర ఉందని  ఆరోపించారు. రెండు వేపులా మాటల తూటాలు పెళ పెళార్భాటాలతో పేలుతున్నాయి. అయితే తొలుత రిటైర్డ్ ఇంజనీర్స్ సంఘం ఇచ్చిన ఫార్ములా పైకి కొంత సమంజసంగా కనిపించినా ముఖ్యమంత్రి వివరణ తద్భిన్నంగా మరోలా వుంది. గణాంకాల్లో కూడా పొంతన లేదు. ఏ ఒక్క బరాజ్ తలుపులు మూసి పంపింగ్ చేసేందుకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నిషేధం విధించి ఉన్నందున  ఈ రిపోర్టును సుదర్శన చక్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఆదేశాలు తమకు శిరోధార్యమని తేల్చి వేయడంతో రిటైర్డ్ ఇంజనీర్స్ సంఘం ఫార్ములా కూడా ఎందుకూ పనికి రాకుండా పోయింది. మేడిగడ్డలో 93.5 మీటర్ల వరకు యండిడియల్ స్థాయిలోనూ అన్నారం సుండిళ్ల బరాజ్ ల్లో 5 టియంసిల వరకు నీళ్లు నింపితేనే పంపింగ్ సాధ్యమని ఇప్పుడు కూడా నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ చెబితే అమలు చేసేందుకు సిద్ధమని బంతి  కేంద్ర ప్రభుత్వ సంస్థ కోర్టులోనికి ముఖ్యమంత్రి తోసేశారు. మూడు బరాజ్ తలుపులు ఎప్పుడూ తెరచి ఉంచాలని  అథారిటీ రిపోర్టులో ఉందని  ఇప్పుడు కూడా నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ చెబితే తాను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చేతులు దులుపు కున్నారు.
పంటలు ఎండి పోతున్నాయని చెప్పి రైతుల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం  అదే సమయంలో ఏ విధంగానైనా మూడు బరాజ్ లను పని చేసేట్టు చూడాలని బిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతోంది. కెసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నేతలు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్  కాజేసి ప్రాజెక్టును నాసి రకంగా నిర్మించినందున బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణం లోపాలు బయట పడ్డాయని వారి స్వార్థంతోనే దుర్భిక్ష పరిస్థితుల్ల కోట్లాది రూపాయలు వ్యయం చేసిన ప్రాజెక్టు రైతులను ఆదుకోలేకున్నదని బహిర్గతం చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంగా ఉంది . మరో విశేషమేమంటే బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ప్రమాదకరమైన సూచన చేశారు. బరాజ్ లను ఉపయోగంలోనికి తీసుకు వస్తే  ఒక వేళ ప్రమాదం జరిగినా ఏమీ కాదని హరీష్ రావు మరో ఫార్ములా తీసుకు వచ్చారు. అన్నారంలో. 5 టియంసిలు సుండిళ్లలో 3.8 టియంసిలు నీరు నిల్వ చేస్తే అంటే తలుపులు మూసి పంపింగ్ చేస్తుంటే ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవించితే 1.10 లక్షల క్యూసెక్కులు వరద ప్రవాహం ఉంటుందని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు గోదావరి కింద భాగంలో భద్రాచలం తదితర పట్టణాలకు ఏమీ కాదని ఒక ప్రకటనలో తెలిపారు. బరాజ్ ల తలుపులు మూసి నీరు నిల్వ చేస్తే ఏదైనా ప్రమాదం జరగ వచ్చని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ చేసిన సూచన పక్కన పెట్టి రిస్క్ చేసైనా పంపింగ్ చేసి ఎండి పోతున్న రైతుల పంటలు కాపాడాలని బిఆర్ఎస్ పార్టీ భావనగా ఉంది .
ఇది ఏలాగూ అమలు కాదని అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల ముందు బదనాం చేయాలనే వ్యూహం లేక పోలేదు. ఒక వేళ బరాజ్ లకు నష్టం జరగక పోతే తమ హయాంలో నిర్మాణం జరిగిన బ్యారేజీలు అందరూ చెబుతున్నట్లు నిర్మాణం నాసి రకంగా లేదని ప్రచారం చేసుకోవచ్చని కూడా బిఆర్ఎస్ పార్టీ ఇన్ని ఎత్తుగడలు వేస్తోంది. మరో వేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టును వజ్రాయుధంగా ఉపయోగిస్తున్నారు. రిజర్వాయర్లను బరాజ్ తరహాలో నిర్మించడమే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్ని తిప్పలు తెచ్చి పెట్టిందని ఘోష్ కమిషన్ తేల్చింది. బ్రిటీష్ కాలంలో నిర్మీంపబడిన ధవళేశ్వరం బ్యారేజీ పొడవు 3.5 కిలోమీటర్లు కాని నిల్వ సామర్థ్యం 2.93 టియంసిలు మాత్రమే. అదేవిధంగా సుంకేసుల బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.25 టియంసిలు మాత్రమే. కాని మేడిగడ్డ నీటి నిల్వ సామర్థ్యం 16 టియంసిలు. కాంక్రీట్ డ్యాం పొడువు 1.6 కిలోమీటర్లు. మిగిలిన రెండు బరాజ్ లు ఇదే విధంగా నిర్మింప బడటమే ముఖ్యమైన అడ్డంకిగా ఉంది . ఇదిలా ఉండగా ఈ మాటల తూటాల్లో అంతర్ రాష్ట్ర జల వివాదాలు కూడా చోటు చేసుకొంటున్నాయి. . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా నీళ్లు పంపింగ్ చేసుకొనేందుకే మేడిగడ్డ నుండి నీళ్లు వదలి పెడుతున్నారనే ఆరోపణ బిఆర్ఎస్ నేతలు వరస బెట్టి చేస్తున్నారు. ఈ ఆరోపణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే పట్టిసీమ ఎత్తిపోతలు నిర్మించారని దీనికేమి సమాధానం చెబుతారని ఎదురు తిరిగారు. ఇంతకీ కొసమెరుపు ఏమంటే మేడిగడ్డ నుండి బిఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నట్లు 70 వేల క్యూసెక్కులు కిందకు పోతున్నాయి. కాని పట్టిసీమ ఎత్తిపోతలు ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ ఎత్తి పోస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *