- ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్దే..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
- కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
- సంగారెడ్డిలో బిఆర్ ఎస్ కార్యాలయం ప్రారంభం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధును బంద్ చేశారని, యాదవులకు గొర్రెల పంపిణీ బంద్ చేశారని, హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈసందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. ఏడాదిగా కూలగొట్టుడే తప్ప ఒక్కటైనా కట్టావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడని ఎద్దేవా చేశారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి హిట్ వికెట్ అయ్యారని, లగచర్లలో రైతులని జైల్లో పెట్టి హిట్ వికెట్ అయిపోయడాని అన్నారు.
సీఎంకు రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని, ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. కేసిఆర్ టోర్నమెంట్ ను మాణిక్ యాదవ్ నిర్వహించి తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమీన్ పూర్ తో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. నీళ్ల బాధలు చూసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది అని, మిషన్ భగీరథ తో బిందెలు పట్టుకునే అవసరం లేకుండా చేసిన ఘనత కేసిఆర్ దేనని అన్నారు. రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడని, ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ చేస్తనని దేవుళ్ల మీద వోట్లు పెట్టిన రేవంత్ రెడ్డి, గద్దె ఎక్కి 12 నెలలు అయింది.
మహాలక్ష్మితో 24 వేలు ప్రతి మహిళకు బాకీ ఉన్నాడని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వొస్తే మా పైసలు ఎటుపోయానని చొక్కా పట్టుకొని అడగండి అని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఇస్తున్నాడు కదా ఇక్కడ రేవంత్ ఎందుకు ఇవ్వడు ? అని నిలదీశారు. తెలంగాణను తాగుబోతు తెలంగాణ చెయ్యాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని, రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే రక్ష అని హరీష్ రావు అన్నారు.