పార్టీ మారిన వారు మాజీలు కాక తప్పదు
అప్రజాస్వామిక ప్రభుత్వానికి చెంపపెట్టు
హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసిన బిఆర్ఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయమని, వారు మాజీలుగా మారడం ఖాయమన్నారు. పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికలపై హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై కెటిఆర్ స్పందిస్తూ…ఈ తీర్పుతో ఇక ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని కేటీఆర్ అన్నారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందన్నారు. హైకోర్డు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాసన సభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ సోమవారం వి•డియాతో మాట్లాడుతూ..పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ జరిగిందని.. సుదీర్ఘ వాదనలు జరిగాయని అన్నారు.
నాలుగు వారాల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ నిర్లక్ష్యం చేస్తే తామే విచారణ చేస్తామని హైకోర్టు చెప్పిందన్నారు. స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. 1985లో రాజీవ్ గాంధీ 52వ షెడ్యూల్ సవరణ ద్వారా పార్టీ మారే, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే వారిపై అనర్హత వేటు వేయాలని చట్టం తెచ్చారన్నారు. ఒక సమయం దానిలో పెట్టకపోవడమే ఇన్ని అనర్దాలకు కారణమన్నారు. 39 ఏళ్ల క్రితం చట్టం వొచ్చినా అందులో లొసుగులు ఉండడం కొందరికి ఉపయోగకరంగా మారాయని తెలిపారు. ప్రధాని మోదీ అన్నీ నీతిలే చెప్తారని..ఎన్నో చట్ట సవరణలు తెచ్చారని, కానీ ఈ చట్ట సవరణ చేయరని మండిపడ్డారు. శాసనసభ స్పీకర్ కోర్టుతో చీవాట్లు తినాలా..అంటూ వినోద్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఖర్గే మాటలను తెలంగాణ స్పీకర్ వినకుండా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బి ఫామ్పై గెలిచి, పార్టీ మారిన ద్రోహులకు చెంప పెట్టులా హైకోర్టు తీర్పు వొచ్చిందని, ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా కోర్టు తీర్పు ఉందని, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.




