యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీ

వర్సిటీలో కోర్సులకు గుర్తింపు
ఫీజరియంబర్స్‌మెంట్‌తో సామాన్యులకు చోటు
కంప్యూటర్లు ప్రవేశ పెట్టి యువతకు దారి చూపిన రాజీవ్‌
అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిఎం రేవంత్‌ వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : యువత నైపుణ్యాభివృద్దికే స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. యువతకు నిపుణులతో స్కిల్స్‌ కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడేలా చేస్తామని అన్నారు. అసెంబ్లీలో స్కిల్‌ యూనివర్శిటీ బిల్లుపై సిఎం మాట్లాడుతూ… ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందని..వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతుందన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వీరికి ఫీజులు కూడా తక్కువేనని, కనీసంగా ఏడాదికి 50వేలు నిర్ధారించారని అన్నారు.

అసవరమైతే ఫీజు రియంబర్స్‌మెంట్‌ ద్వారా ఆదుకుంటామని అన్నారు. హైదరాబాద్‌లో సాప్ట్‌ వేర్‌ రంగం అభివృద్ధికి రాజీవ్‌ గాంధీ కారణమని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఆనాడు జవహర్‌ లాల్‌ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి.. వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని..  ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌ ఇచ్చి ప్రోత్సహించారన్నారు.  రాజీవ్‌ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.  హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్‌ గాంధీ పునాదులు వేశారని..ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. యంగ్‌ ఇండియా పత్రిక మహాత్మాగాంధీ మొదలు పెట్టారు. మహాత్మాగాంధీ స్పూర్తితో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నామని..  లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్స్‌ యూనివర్సిటీ ఉద్దేశమని ప్రకటించారు.

స్కిల్స్‌ 17 కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెట్టనున్నామని..  స్కిల్స్‌ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్‌ అందిస్తామన్నారు. ఈ సంవత్సరం 6కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్‌ కు అవకాశం ఇస్తున్నామని..  శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. భవిష్యత్‌ లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.  బీఆరెస్‌ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టదు..రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆరెస్‌ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.  స్కిల్స్‌ యూనివర్సిటీపై చర్చ జరగకూడదని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదుల తో వాదించేలా కృషి చేశామని..  దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.  కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్‌ చేసి వెళ్లిపోయారు..  అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనన్నారు. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *