- కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% తెలంగాణకు లబ్ధి
- తెలంగాణకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయి
- ఆదాయ పన్ను పరిధిని 12 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం
- కేంద్ర బడ్జెట్ 2025-26పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ‘‘బడ్జెట్లో పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్. ఆదాయపన్ను విషయంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మోదీ సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది మోదీ ప్రభుత్వం 12వ పూర్తిస్థాయి బడ్జెట్. 2014 నుంచి ఎన్నో సంస్కరణలు, కీలక నిర్ణయాలు తీసుకున్నాం. వాటి ఫలితాలు నేడు స్పష్టంగా కనబడుతున్నాయి. విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగంలో ఫలాలు కనబడుతున్నాయి. బడ్జెట్ లోనే కాకుండా.. బడ్జెట్ బయట కూడా కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి కేటాయింపులు చేస్తోంది. 2025-26 బడ్జెట్ ఒక డ్రీమ్ బడ్జెట్ గా గుర్తుండిపోతుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే బడ్జెట్ ఇది. వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్దేశించుకుని 2047 నాటికి చేరుకునేలా రూపొందించాం.
వ్యక్తిగత ఇన్ కమ్ టాక్స్ పరిధిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. 2014లో ఇది 2 లక్షలుంటే.. ఇవాళ దీన్ని 12 లక్షలకు పెంచడం ఎవరూ ఊహించని పెద్ద సంస్కరణ. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. ప్రజల సంక్షేమాన్ని, వారి అవసరాల కోసం ప్రజల చేతుల్లో డబ్బులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% పథకాల్లో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది. ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలకు ఆపన్నహస్తాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా కోటి ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని ద్వారా 7.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం మన దేశ తయారీ రంగంలో 36%, ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు వొచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల రుణాలు అందిస్తాం. తెలంగాణలో ఉన్న 10 లక్షలకు పైగా రిజిస్టర్ అయిన ఎంఎస్ఎంఈలకు ఇదెంతో ప్రయోజనం చేకూర్చనుంది. 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ స్టార్టప్లకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేయనున్నాం.
దీని వల్ల తెలంగాణ స్టార్టప్ లకు ఎంతో లబ్ధి చేకూరనుంది. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ.. సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. రూ.27 వేల కోట్లనుంచి రూ.30 వేల కోట్లకు పెరిగిన తెలంగాణ వాటా టాక్స్ డెవల్యూషన్ (రాష్ట్రాల వాటా పన్నుల మొత్తం). సహకార సమాఖ్యను మరింత బలోపేతం చేసేలా.. రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందించనున్నాం. ఇందులోనూ తెలంగాణకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఏ పథకం తీసుకొచ్చినా.. దాని లబ్ధి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను అమలు చేస్తే మరిన్ని ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఇప్పటికే అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిని, నిధులను పెంచాం. హైదరాబాద్ వంటి నగరాలకు 10వేల కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ రానుంది. అమృత్ పథకానికి 6 వేల కోట్ల నుంచి 10వేల కోట్లకు పెంచడం ద్వారా తెలంగాణలోని 125కు పైగా అర్బన్ లోకల్ బాడీస్ లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. స్ట్రీట్ వెండర్స్కు రూ.30 వేల విలువైన క్రెడిట్ కార్డులు అందిస్తాం. దీని ద్వారా తెలంగాణలోని సుమారు 7.5 లక్షలమంది స్వనిధి పథకం లబ్ధిదారులకు మరింత మేలు చేకూరనుంది.
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్ కింద నమోదు చేసుకునే అవకాశం. వేలాది మంది తెలంగాణ గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుంది. నేషనల్ జియో స్పేషియల్ మిషన్ ద్వారా.. ల్యాండ్ రికార్డస్ ఆధునీకరణ, అర్బన్ ప్లానింగ్, మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్లానింగ్ . మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ ‘హీల్ ఇన్ ఇండియా’ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ ప్రపంచంలో ఓ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ తరుణంలో మెడికల్ టూరిజానికి ప్రోత్సాహం ద్వారా మన భాగ్యనగరం కూడా లబ్ధి పొందనుంది. ప్రతి జిల్లా కేంద్రంలోని దవాఖానల్లో డయాలసిస్ సెంటర్స్ తీసుకొచ్చాం. ఇకపై కేన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం.
ఆయుష్మాన్ భారత్ నిధులు 23 శాతానికి పైగా పెంచడం తెలంగాణకు కూడా ఉపయోపడనుంది. ఆర్థిక స్థోమత తో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి ఈ నిధుల పెంపు జరిగింది. 2 లక్షల కోట్లు దాటిన ప్రధానమంత్రి గరీబ్ అన్నకల్యాణ్ యోజన కేటాయింపుల ద్వారా తెలంగాణ లబ్ధిదారులకు మేలు చేకూర్చనుంది.సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కేటాయింపులు.. 11వేల కోట్ల నుంచి 20వేల కోట్లు పెంచాం. ‘జల్ జీవన్ మిషన్’ 2028 వరకు కొనసాగించాం. కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణ రైతులకు లాభం చేకూరనుంది. 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా పీఎం ధన-ధాన్య కృషి యోజన కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ ప్రోగ్రామ్ను ప్రారంభించాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రోత్సాహకాలు అందిచనున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ 50 వేల పాఠశాలలకు పెంపుతో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్లు , ఉన్నత పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ తో పాటు వైఫై సదుపాయం కల్పిస్తాం. ‘భారతీయ భాషా పుస్తక్ స్కీమ్’ ద్వారా పాఠశాలలు, ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తాం. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు కల్పించబోతున్నాం.
ఐఐటీల్లో తీసుకొచ్చిన సంస్కరణలతో.. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. వచ్చే పదేళ్లలో 1.1 లక్షల మెడికల్ (యూజీ, పీజీ) సీట్లు పెంచుతాం.. ఇప్పుడున్న దానికి దాదాపు 130% పెరుగుతాయి. వొచ్చే ఏడాదికల్లా 10 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వొస్తాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. వాటికి అనుగుణంగానే ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు. అంతే తప్ప తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడిచారు.