ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఆయన తిలకించారు. ఆఫ్ లైన్ లో పనిచేసే ఈ టూల్ ను ప్రభుత్వ విభాగాలకు అనుసంధానిస్తే రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు.
వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికలో అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా అలెరియా ఏఐ సహాయ పడుతుందని వారు వెల్లడించారు. ఫ్రాన్స్, యుఏఇ దేశాల్లో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఈ టెక్నాలజీ సంస్థ పరిజ్ణానాన్ని దేశంలో మార్కెట్ చేసేందుకు ఐబీటీ ఇన్నోవేషన్స్, ఇన్నోలాజిక్ టెక్నాలజీస్ అనుమతి పొందాయి. మంత్రి శ్రీధర్ బాబును కలిసిన వారిలో ఐబీటీ సిఇఓ మన్సూర్ అలీ ఖాన్, అలెరియా సిఇఓ ఎరిక్ లియాండ్రీ, ఇన్నోలాజిక్ సిఇఓ శివ దొండపాటి తదితరులు ఉన్నారు.