కొత్తగా సోలార్ పెన్సింగ్ స్కీం అమలు చేసే యోచన
•కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలి
•జూన్ లో రాష్ట్రంలో మరో ఆయిల్ పామ్ కర్మాగారం ఏర్పాటు
•వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ స్కీంను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ఉద్యానశాఖ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో ఉద్యాన పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సోలార్ ఫెన్సింగ్ స్కీం అమలవుతున్న హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీపై అందించేందుకు విధి విధానాలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనివల్ల కూరగాయలు, ఉద్యాన పంటల సాగు చేయడానికి రైతులు ముందుకు వొస్తారన్నారు.హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న అన్ని ప్రాంతాల్లో కూరగాయల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటుచేసి, రైతులకు ప్రోత్సహకాలు కూడా అందించేలా చూడాలన్నారు. కూరగాయల సాగు కోసం అవసరం మేరకు యంత్ర పరికరాలు సబ్సిడీపై అందించి, సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో కూరగాయల పంటలను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసి, కూరగాయలను దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేసే స్థితికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. వొచ్చే ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా ముందస్తుగా డ్రిప్ స్ప్రింక్లర్ల పంపిణీ కోసం దరఖాస్తులను స్వీకరించి, గ్రౌండింగ్ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో సాగు చేస్తు లాభాలు పొందుతున్న మెకడమియా పంటను రాష్ట్రంలో ప్రవేశ పెట్టడానికి గల వాతావరణ స్థితిగతులు, నేలలు, నర్సరీలు, మార్కెటింగ్ అవకాశాలను అధ్యయనం చేయాలని ఉద్యాన శాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
మార్చి నెలాఖరు కల్లా ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటీసులు జారీ చేసి, ఏయే జిల్లాలలో తక్కువ పురోగతి ఉందో వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి మల్టీ నేషనల్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీకి సదరు ప్రాంతాన్ని అప్పగించామన్నారు. అలాగే ఇంకా ఎక్కడైనా కంపెనీలు మూడు, నాలుగేళ్లు అయినప్పటికి ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి భూమి గుర్తించకపోవడం, ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలను తొలగించి, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ కు బాధ్యతలు అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. వొచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయిల్ పామ్ సాగు కోసం 2 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ సిబ్బందికి కూడా లక్ష్యాలు నిర్ధేశించి వాటిని చేరుకొనేలా పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్ పూర్తి చేసేట్టుగా, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్ కి సూచించారు.
వొచ్చే సంవత్సరం చివరికల్లా ఉమ్మడి జిల్లాలలో కనీసం ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూడాలని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కనీసం సంబంధింత జిల్లాలలో 6 వేల ఎకరాలకు పైన ప్లాంటేషన్ ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఆయిల్ పామ్ కర్మాగారాన్ని మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, అదేవిధంగా గద్వాల జిల్లా బీచుపల్లిలో, ఖమ్మం జిల్లా కల్లూరిగూడంలో ఆయిల్ పామ్ కర్మాగారాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, పనులు ప్రారంభించి, ఈ డిసెంబర్ కల్లా వాటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 6 వేల ఎకరాల పైన ప్లాంటేషన్ పూర్తి చేసిన ప్రైవేట్ కంపెనీలు కూడా వెంటనే పామ్ ఆయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.