అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి
•శాంతి భద్రతల రక్షణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు
•రంజాన్ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మార్చి రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. వీధి దీపాలు మరమ్మతులు, తాత్కాలిక లైట్ల ఏర్పాటు చేస్తామని జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు. రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మక్కా మసీదు, రాయల్ మాస్క్ , మిరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో దోమల నివారణకు జిహెచ్ఎంసి ఎంటమాలజీ టీం ద్వారా ఫాగింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మసీదు ల వద్ద ప్లాస్టిక్ కవర్ ల పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించి సమన్వయం చేస్తున్నామని తెలిపారు.
మసీదులు , ఈద్గాల వద్ద వాటర్ ప్యాకెట్స్, తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు. మసీదులకు వెళ్లే దారిలో డ్రైనేజీల రిపేర్ పూర్తి చేస్తున్నామని వాటర్ వర్కస్ ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. వేసవికాలం దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రంజాన్ నెలలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మసీదులు, ఈద్గల వద్ద విద్యుత్ ఎమర్జెన్సీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మసీదుల వద్ద టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్ల కోసం బారికేట్లు ఏర్పాటు చేయడానికి ఆర్ అండ్ బి విభాగం సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. రంజాన్ నెల నేపథ్యంలో ప్రజలకు పాల ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవసరాలకు తగిన పాలను సరఫరా చేస్తామని డైరీ అధికారులు తెలిపారు. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకే విధులు ముగించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని జెఏడి అధికారులు తెలిపారు.
రంజాన్ పండగ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా షాపింగ్ చేసుకోవడానికి ట్రాఫిక్ ను నియంత్రిస్తూ అర్ధరాత్రి వరకు వీధి వ్యాపారాలు కొనసాగించడానికి అనుమతించాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగ వేళ ట్రాఫిక్ పేరుతో ఇబ్బందులు కలిగించకూడదని కోరారు. పండగ రోజు ట్రాఫిక్ మళ్లింపుల పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే ఈద్గాలు, మసీదుల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రంజాన్ నెలలో ముస్లింలకు పండగ నిర్వహించుకోవడానికి సమయానికి రేషన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తౌసిఫ్ ఇక్బాల్ , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఫహీం ఖురేషి మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ,తెలంగాణ వక్ఫ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ , హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియబని ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెతుల్లా కొత్వాల్ ,మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ , ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ హందాన్ , బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, వాటర్ వర్కస్ ఎండి అశోక్ రెడ్డి వివిధ అధికారులుపాల్గొన్నారు.