తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడండి..

జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించాలి
•కృష్ణా గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చండి
•పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి
•రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలి..
•జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వినతి

దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 3 : కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరీవాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కోరారు. దిల్లీలో జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యా రు. కృష్ణా, గోదావరి నది జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమాశంలోనూ ఆయా వివ రాలను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. కృష్ణా పరీ వాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కు వగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎం‌బీ) పక్ష పాతంగా ఆంధ్రప్రదేశ్‌కు 66, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి వివరించారు.

ఏళ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్‌ ‌తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపో యిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణా నది నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలీ మెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవ సరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్‌ ‌సమర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలియజేశారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలోని అప్పర్‌ ‌భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్‌ ‌బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్‌ ‌రెడ్డి కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎం‌బీ), కేఆర్‌ఎం‌బీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదన్నారు. గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్‌ ‌ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తాము నష్టపోతామని, కృష్ణా డెల్టా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ ‌కౌనిల్స్‌లోనూ ఏపీ గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఎటువంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడి కుంట వాగు, చనాఖా కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్‌ ‌సిస్టమ్‌), ‌చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ).. పీఎంఆర్‌పీ 2024 కింద తగిన ఆర్థిక సహాయం అందజేయాలని జల్‌శక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాలు పాటు వడ్డీలేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి అభ్యర్థించారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్‌ ‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌ ‌రాజ్‌, ‌రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ ‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్‌ ఎం) ‌విజయ్‌ ‌భాస్కర్‌ ‌రెడ్డి, తెలంగాణ భవన్‌ ‌రెసిడెంట్‌ ‌కమిషనర్‌ ‌గౌరవ్‌ ఉప్పల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page