అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించేలా కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అవయవ మార్పిడి చేస్తే గతంలో రూ.5 వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఒక కోటి రూపాయల వరకూ జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు.
1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే అధికారం న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజీషియన్ లకు మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఫిజిషియన్లు, సర్జన్లు, అనస్తీసియిస్టులు కూడా బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడానికి అర్హులు అవుతారు. దీనివల్ల బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలు వృథాగా పోకుండా, అవసరమైన పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతాయి. అవయవ దానం, మార్పిడిపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు అవుతుంది. కేంద్రం, ఇతర రాష్ట్రాల్లోని అవయవ మార్పిడి వ్యవస్థలతో జీవన్దాన్ను అనుసంధానం అవుతుంది.
ఇతర రాష్ట్రాల్లో బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి సేకరించిన అవయవాలను, మన రాష్ట్రంలోని పేషెంట్లకు అమర్చడానికి అవకాశం కలుగుతుంది. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ‘‘అవయవాలు, కణజాల సేకరణ కేంద్రాలు, స్టోరేజ్ కేంద్రాలు’’ ఏర్పాటు అవుతాయి. పారదర్శకత పెరుగుతుంది.మెడికల్ టూరిజం బలోపేతానికి దోహదపడుతుంది. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రితో చర్చించి ఆర్గాన్ డోనర్ల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన పాలసీని రూపొందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.